విమాన సిబ్బందికి డీజీసీఎ కీలక ఉత్తర్వులు .. విధుల్లో చేరాలంటే.. ఆ పరీక్ష తప్పనిసరి..
కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఎ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో విమాన సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష ఇక నుంచి తప్పనిసరి కానుంది
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ అంత సాధారణ స్థాయికి చేరుకుంది. విమానయంగా కూడా యథా విధంగా నడుస్తోంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బంది అందరికీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను పునరుద్ధరించనున్నది. సిబ్బంది మద్యం తాగి విమానాన్ని నడపకుండా మళ్లీ కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలట్లు, సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. అక్టోబర్ 15 నుండి పైలట్లు, సిబ్బంది అందరికీ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష మళ్లీ తప్పనిసరి రోజు పరీక్ష చేయించుకోవాలి. కరోనా కేసులు నిరంతరం తగ్గుముఖం పట్టడం, విమానాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విమానాలు యథావిధిగా పనిచేయడం ప్రారంభించాయి,
గతంలో కూడా ఈ నిబంధన అమలులో ఉండేవి. కానీ, కొవిడ్ మహమ్మారి విజృంభనతో.. ఈ నిబంధనపై కొన్ని పరిమితులు విధించారు. సిబ్బందిలో 50 శాతం మందికి మాత్రమే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 2021లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గంటకు ఆరుగురికి మాత్రమే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇటీవల కోర్టు ఈ ఆదేశాలను సవరించింది. దీంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలను మళ్లీ ప్రారంభించనున్నట్టు డీజీసీఎ బుధవారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన ఆదేశాల ప్రకారం.. ప్రతి విమానంలోని సిబ్బంది అందరికీ బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని డీజీసీఎ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశంలో ఈ పరీక్షలు నిర్వహించాలని, ఆ ప్రాంతంలో సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులు ముందుగా విమాన సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది కూడా పరీక్షించాలని పేర్కొంది. ఒకవేళ ఎవరికైనా.. కరోనా పాజిటివ్గా నిర్థారణ అయితే.. ఆ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయకుండా.. విధుల నుంచి సెలవు ఇవ్వాలని పేర్కొంది.