ఢిల్లీ మరణాల వెనక తాంత్రిక కోణం: 11 పైపులు పెట్టింది అతనే
ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల వెనక తాంత్రిక కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టింజ్ ఆపరేషన్ గీత మా తన పాత్రను అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల వెనక తాంత్రిక కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టింజ్ ఆపరేషన్ గీత మా తన పాత్రను అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. గత ఆదివారంనాడు బురారీలోని ఇంట్లో 11 మంది కుటుంబ సభ్యులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తాంత్రికురాలు గీతా మా బోధనల కారణంగానే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఓ న్యూస్ చానెల్ స్టింజ్ ఆపరేషన్ ను బయటపెట్టింది. ఆత్మహత్యల తర్వాత వారి ఆత్మలు మోక్షం పొందడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లు భావిస్తున్న 11 పైపులను గీత తండ్రి అమర్చినట్లు చెబుతున్నారు.
ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించాడని భావిస్తున్న కుటుంబ సభ్యుడు లలిత్ భాటియా ఇంటి నిర్మాణం కాంట్రాక్టు పనులు అతనికే అప్పగించారు. వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని, త్వరలో వారిని తాను కలుసుకోబోతున్నానని గీత చెప్పినట్లు న్యూస్ చానెల్ స్టింజ్ ఆపరేషన్ లో బయటపడింది.
అయితే, క్రైమ్స్ డిసిపి జోయ్ టిర్కే తాంత్రిక కోణం ఆరోపణలను కొట్టేశారు. స్టింజ్ ఆపరేషన్ బయటపడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు గీతా మాను ప్రశ్నించారు. గీత ముగ్గురు పిల్లల తల్లి.
తన కూతురు చెప్తే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణల్లో నిజం లేదని గీత తండ్రి చెప్పాడు. గీత చేతుల్లో మహత్మ్యం ఉందని, తన వద్దకు వచ్చే రోగులను స్పృశిస్తే వారికి నయమవుతుందని, ఆమెకు తాంత్రిక విద్యలేవీ రావని అన్నారు.
భాటియా ఇంట్లో అమర్చిన 11 పైపుల వెనక మర్మమేమీ లేదన ఆయన అన్నారు. దర్యాప్తు అధికారులు ఇంటి కొలతలతో పాటు గోడలు, బాల్కనీ, టెర్రాస్ కొలతలు తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో బయటివారు ఎవరైనా ప్రవేశించి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి ఆ కొలతలు తీసుకున్నారు.