శ్రద్ధా వాకర్ తలను ఢిల్లీలోని కొలనులో పడేసినట్టు నిందితుడు, ఆమె బాయ్ఫ్రెండ్ అఫ్తాబ్ పోలీసులకు వివరించాడు. ఈ వెల్లడి తర్వాత పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కొలనులోని నీటిని తోడి పోస్తున్నారు. ఆమె తల కోసం గాలింపులు జరుపుతున్నారు.
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య గురించిన ఆధారాలు, ఆమె డెడ్ బాడీ పార్ట్స్ను కనుగొనడానికి పోలీసులు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, ఈ రోజు ఢిల్లీ పోలీసులు శ్రద్ధా వాకర్ తల కోసం మెహరౌలీ ఏరియాలోని ఓ కొలనులో వెతుకుతున్నారు. ఇందుకోసం పోలీసులు ఏకంగా ఆ కొలనులోని నీటినే ఖాళీ చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, శ్రద్ధా వాకర్ బాయ్ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా దర్యాప్తు అధికారులకు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ పనికి పూనుకున్నారు. తన గర్ల్ఫ్రెండ్ శ్రద్ధా వాకర్ తలను వేరు చేసిన తర్వాత దాన్ని పాండ్లో పడేసినట్టు పోలీసులకు నిందితుడు తెలిపాడు. దీంతో పోలీసుల బృందం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సంయుక్తంగా ఈ రోజు మెహరౌలీ పాండ్ను ఖాళీ చేయడం మొదలు పెట్టింది. మోటార్లు పెట్టి మరీ నీటిని బయటకు తోడిపోస్తున్నారు.
అఫ్తాబ్ తనతో కలిసి సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్ను అత్యంత కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశారు. అందులో కొన్నింటిని మొహరౌలీ ఫారెస్ట్లో పడేశాడు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత 20 రోజుల సమయంలో ఇలా వివిధ ప్రదేశాల్లో శరీర భాగాలను విసిరేశాడు. విషయం వెలుగులోకి వచ్చాక ఈ సోమవారం అఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మొహరౌలీ అడవిలో ఆధారాల కోసం శోధిస్తున్నారు. నవంబర్ 16 నుంచి మొత్తం మూడు సార్లు పోలీసులు అటవీ ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు. శనివారం ఉదయం ఆరు గంటలకే మొహరౌలీ అటవీ ప్రాంతానికి చేరుకుని శ్రద్ధ ఎముకలను సేకరించారు.
ALso Read:శ్రద్దా హత్య కేసు: అఫ్తాబ్ అన్ని నీళ్లు ఎందుకోసం వాడాడు.. అధిక నీటి బిల్లు పోలీసులకు ఆధారం కానుందా?
మరోవైపు... ఈ కేసు విచారణ జరుపుతున్న అధికారులు.. అఫ్తాబ్ నివాసం ఉంటున్న అద్దె ఇంటికి అధిక వాటర్ బిల్లు రావడంపై దృష్టి సారించారు. నెలకు 20,000 ఉచిత నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ.. అఫ్తాబ్ ఉంటున్న ఇంటికి రూ. 300 బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అఫ్తాబ్ అంత పెద్ద మొత్తంలో నీటిని ఎందుకు వినియోగించాడనే అంశంపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.
యువతి శరీర భాగాలను కత్తిరించే సమయంలో వచ్చే శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ట్యాప్ను ఆన్ చేసి ఉంచడం, శరీరం లోని రక్తాన్ని కడగడానికి వేడినీరు, ఫ్లాట్లోని మరకలను తొలగించ డానికి నీటిలో రసాయనాలు కలపడం.. వంటివి చేయడం వల్ల రూ. 300 వాటర్ బిల్లు పెండింగ్ లో ఉందని ఈ కేసు ను విచారణ జరుపుతున్న వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా విచారణ లో ఒక ఆధారంగా మారే అవకాశం ఉంది.
