బుల్లిబాయ్ యాప్ సృష్టికర్త అరెస్టు.. అసోంలో అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బుల్లి బాయ్ యాప్ క్రియేటర్ 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్ను ఢిల్లీ పోలీసులు అసోంలో అరెస్టు చేశారు. ఈ యాప్ను క్రియేట్ చేయడానికి వాడిన ల్యాప్టాప్నూ పోలీసులు సీజ్ చేశారు. తాజా అరెస్టుతో ఈ కేసులో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్టయింది. మిగతా ముగ్గురిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బుల్లి బాయ్ యాప్(Bulli Bai App) సృష్టికర్తను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బుల్లి బాయ్ యాప్ క్రియేటర్ 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్(Neeraj Bishnoi)ను ఢిల్లీ పోలీసులు(Delhi Police) అసోంలో అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్టయింది. చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి సమ్మతి లేకుండా బుల్లి బాయ్ యాప్లో అప్లోడ్ చేసి ఆన్లైన్లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేపాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది.
నీరజ్ బిష్ణోయ్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. భోపాల్లోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాడు. అసోంలోని దిగంబర్ జొర్హట్కు చెందిన వాడు. తాజాగా, ఢిల్లీ పోలీసులు అసోంలో ఆయనను జొర్హట్ నుంచి అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఓ డివైజ్ను పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్ ద్వారానే బుల్లి బాయ్ యాప్ డెవలప్ చేశారు. ఇదే రోజు మధ్యాహ్నం ఆయనను ఢిల్లీకి తీసుకురాబోతున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ పరిధిలోని ఐఎఫ్ఎస్వో టీమ్ నీరజ్ బిష్ణోను అరెస్టు చేసిందని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా వెల్లడించారు. గిట్ హబ్లో బుల్లి యాప్ తయారీదారు ఆయనే అని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. ట్విట్టర్లో ఈ యాప్నకు ఖాతాదారు ఈయనే కావడం గమనార్హం.
Also Read: Bulli Bai: ఆన్లైన్ లో అమ్మకానికి అమ్మాయిలు.. యాప్లో ఓ వర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !
ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, లాయర్లు, కార్యకర్తలను ఈ యాప్లో టార్గెట్ చేసుకున్నారు. సామాజికంగా, రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న వారి ఫొటోలను వారి అనుమతి లేకుండానే చౌర్యం చేసి అభ్యంరకతర కామెంట్లతో ఆన్లైన్లో ఆక్షన్ జరిగింది. సోషల్ మీడియాలోనూ మార్పు చేసిన ఫొటోలను యాప్లోకి అప్లోడ్ చేసి గిట్ హబ్ ద్వారా వేలం వేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఢిల్లీలోని ఓ మహిళా జర్నలిస్టుపై వెలికి తీసి పిటిషన్ వేశారు.
ఈ కేసులో నీరజ్ బిష్ణోయ్ కంటే ముందు ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని ముంబయి పోలీసు సైబర్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. 21ఏళ్ల స్టూడెంట్ మయాంక్ రావల్, 19 ఏళ్ల శ్వేత సింగ్, ఇంజినీరింగ్ స్టూడెంట్ విశాల్ కుమార్ ఝాలను అరెస్టు చేశారు. ఈ కేసులో శ్వేత సింగ్ మాస్టర్ మైండ్ అని ముంబయి పోలీసులు తెలిపారు.
Also Read: Bulli Bai: హిందు మహిళలే లక్ష్యంగా ఫేస్బుక్, టెలిగ్రామ్ చానెల్..! స్పందించిన కేంద్రం
చాలా మంది ముస్లిం మహిళలలు తమ పేర్లు ఆ ఆక్షన్ లిస్టులో ఉన్నట్టు కనుగొనడంతో ఈ ఉదంతం జనవరి 1న వెలుగులోకి వచ్చింది.
హిందు మహిళలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫేస్బుక్ పేజీలు(Facebook Pages), టెలిగ్రామ్(Telegram Channel) యాప్లో చానెళ్లు ఉన్నట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఫేస్బుక్ పేజీలు, టెలిగ్రామ్ చానెళ్లు హిందు మహిళల ఫొటోలను షేర్ చేస్తున్నాయని, వారిపై వేధింపులకు పాల్పడుతున్నాయని యూట్యూబర్ అన్షుల్ సక్సేనా ఆరోపణలు చేశారు. జూన్ 2021లో ఆ టెలిగ్రామ్ చానెల్ను సృష్టించినట్టు తెలిపారు.