ఢిల్లీ లిక్కర్స్కాం: అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు అమిత్ ఆరోరాను బుధవారంనాడు అరెస్ట్ చేశారు. అమిత్ ఆరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముఖ్య అనుచరుడు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను ఈడీ బుధవారంనాడు అరెస్ట్ చేసింది. బడ్డీ రిటైల్ ప్రైవేట్ సంస్థ యజమానిగా ఉన్న ఆరోరా.సీబీఐ, ఆడీ ఎఫ్ఐఆర్లలో 9వ నిందితుడిగా అమిత్ ఆరోరా ఉన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం అమిత్ ఆరోరాను ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై వ్యాపారవేత్త అమిత్ ఆరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. గురుగ్రామ్లో బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా అమిత్ ఆరోరా ఉన్నారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆరోరాను బుధవారంనాడు తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ తొలుత కేసును నమోదు చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ రంగంలోకి దిగింది. కోర్టులో దాఖలు చేసిన చార్జీషీట్లలో అమిత్ ఆరోరా, దినేష్ ఆరోరా పేర్లను కూడా దర్యాప్తు సంస్థలు చేర్చాయి. ఈ కేసులో అరెస్టైన దినేష్ ఆరోరా సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుని ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. నిన్న కూడా అమిత్ ఆరోరాను కూడా ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణకు అమిత్ ఆరోరా సహకరించడం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. అమిత్ ఆరోరాను గతంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అమిత్ ఆరోరాకు చెందిన సంస్థలపై సీబీఐ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. అమిత్ కంపెనీకి చెందిన కంపెనీలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.అంతేకాదు అమిత్ ఆరోరా సంస్థలు హోటల్, విమాన టికెట్లను కూడా బుక్ చేసిన విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ ఆరోరా లబ్ది పొందారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: తొలి చార్జీషీట్ ను దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 25న మూడు వేల పేజీలతో కోర్టులో చార్జీషీట్ ను దాఖలు చేసింది ఈడీ. ఇద్దరు ప్రభుత్వాధికారులతో పాటు మరో ఐదుగురి పేర్లను చార్జీషీట్ లో చేర్చింది ఈడీ. చార్జీషీట్ లో పేర్లు ప్రస్తావించిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఈడీ కోర్టుకు తెలిపింద. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని కూడా ఈడీ వివరించింది. సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్ , అరుణ్ రామచంద్రన్ పిళ్లై, కుల్ దీప్ సింగ్, నరేంద్ర సింగ్ , అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ ల పేర్లను ఈడీ చేర్చింది.ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దఫాలు విస్తృతంగా సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.