ఢిల్లీ లిక్కర్ స్కాం: తొలి చార్జీషీట్ ను దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ శుక్రవారంనాడు చార్జీషీట్ దాఖలు చేసింది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఏడుగురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ శుక్రవారంనాడు తొలి చార్జీషీట్ దాఖలు చేసింది. . అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లతో పాటు పలువురి పేర్లను చార్జీషీట్ లో చేర్చింది సీబీఐ.కుల్ దీప్ సింగ్, నరేంద్రసింగ్ అనే ఇద్దరు ప్రభుత్వ అధికారులతో పాటు ఏడుగురి పేర్లను సీబీఐ ఈ చార్జీషీట్ లో చేర్చింది. సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్,అరుణ్ రామచంద్రన్ పిళ్లైల పేర్లు కూడా సీబీఐ ఆ చార్జీషీట్ లో పొందుపర్చింది. ఈ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా సీబీఐ తెలిపింది. అభియోగాలు మోపిన వారిలో మరో ఐదుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రైవేట్ వ్యక్తుల కోసం పాలసీలో మార్పులు చేర్పులు చేసినట్టుగా చార్జీషీట్ లో సీబీఐ తెలిపింది.
ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు లేదు. త్వరలోనే మనీష్ సిసోడియాను మరోసారి సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మనీష్ సిసోడియాను ఏ1 గా చేర్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఆగస్టు మాసంలో విచారించారు.మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు ఖాతాలను, ఆయన భార్య ఖాతాలను లాకర్లను కూడ సీబీఐ అధికారులు పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో భాగంగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ కేసులో అవకతవకలు జరిగాయనే విషయమై ఈడీ రంగంలోకి విచారణ నిర్వహిస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దక్షిణాదికి చెందిన వారి పాత్ర ఈ కేసులో ఉందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సహా హైద్రాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబులను ఈడీ అధికారులు విచారించారు.
ఈ కేసులో హైద్రాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శరత్ చంద్రారెడ్డిని, వినయ్ బాబులను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 10వ తేదీన వీరిని ఈడీ అరెస్ట్ చేసింది. విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు తెలిపారు . కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత నాలుగు రోజుల క్రితమే వీరిద్దరిని తీహర్ జైలుకు తరలించారు.