ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్లపై పరువునష్టం.. నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కొడుకు ఆదిత్యా ఠాక్రే, మరో నేత సంజయ్ రౌత్లపై ఏక్నాథ్ షిండె శిబిరం ఢిల్లీ హైకోర్టులో డిఫమేషన్ కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి వారికి ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది.
ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కొడుకు, మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే, ఆయన సన్నిహిత నేత సంజయ్ రౌత్లకు ఢిల్లీ హైకోర్టు పరువు నష్టం కేసులో నోటీసులు పంపింది. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండె క్యాంపునకు చెందిన ఎంపీ రాహుల్ రమేశ్ షెవాలీ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ హైకోర్టు ఈ నోటీసులు పంపింది.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన అనుచరులు రూ. 2,000 కోట్లు ఖర్చు పెట్టి బాణం, ధనుస్సు ఎన్నికల గుర్తును కొనుగోలు చేసుకున్నారని ఆరోపణలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. భవిష్యత్లో వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఇది రాజకీయ విషయం అని, కాబట్టి ఎదుటి పక్షం వాదనలూ విన్న తర్వాతే అలాంటి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాహుల్ రమేశ్ షెవాలే తరఫు న్యాయవాది ఈ పిటిషన్ విచారణలో వాదిస్తూ.. సంజయ్ రౌత్, ఇతరులు ఎన్నిక సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారని అన్నారు. అలాంటి ఆరోపణలకు సమాధానం ఇచ్చే సామర్థ్యం ఈసీఐకి ఉన్నదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.