ఢిల్లీ సామూహిక మరణాలు: ఓ బాబానే కారణమా..ఆత్మహత్యల గురించి లేఖ
ఢిల్లీ సామూహిక మరణాలు: ఓ బాబానే కారణమా..ఆత్మహత్యల గురించి లేఖ
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానస్పద స్ధితిలో మరణించడం దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దేశంలో ఇప్పుడు ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా ఈ సంఘటన గురించే.. మోక్షం కోసం చనిపోయారా..? క్షుద్రపూజలు నమ్మారా..? ఎవరైనా చంపేశారా..? ఇలా ఎవరికి నచ్చినట్లు వారు అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఎక్కువ మంది సందేహం మాత్రం మూఢనమ్మకాలు, ఆధ్యాత్మిక భావాలు, మోక్షం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ డెత్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆధారాల కోసం ఇళ్లంతా పరిశీలించిన పోలీసులకు ఒక లేఖ దొరికింది. దీనిలో మరణానికి కొద్ది క్షణాల ముందు వీరంతా ఎలా గడిపారన్న దాని గురించి రాసి వుంది.. దీని ప్రకారం ప్లాన్ ప్రకారమే మూకుమ్మడి మరణాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇందులో రాసి ఉన్న అంశాలు ఇవే:
* శరీరాన్ని త్యజించడానికి గురవారం లేదా శనివారాన్ని ఎంచుకోవాలి.
* తల చుట్టూ వస్త్రాన్ని గట్టిగా కట్టుకోవాలి.. చీర, దుపట్టాతో తాడుని ఉపయోగించి బిగించాలి.
* చేతికి గుడ్డకట్టుకున్న తర్వాత అది మిగిలితే.. దానిని కళ్లకు కట్టుకోవాలి.
* నోటిని గుడ్డతో గట్టిగా కట్టుకోవాలి.
* అర్ధరాత్రి 12 నుంచి 1 లోపు ఇది జరగాలి.. దీని కంటే ముందు పూజలు చేయాలి.
* చనిపోవడానికి వారం రోజులకు ముందు కర్మకాండలు నిర్వహించాలి. అది కూడా చాలా నియమ నిష్టలతో ఆచరించాలి.. ఈ రోజుల్లో ఎప్పుడు ఆత్మ ఆవహిస్తే ఆ తర్వాత రోజే మీ పని పూర్తి చేయాలి.
* మసక వెలుతురును ఉపయోగించాలి.
* ఎంత అంకిత భావంతో ఈ పనిచేస్తే.. అంతటి ఫలితం కలుగుతుంది.
* అందరూ ఒకే ఆలోచనలతో ఉండాలి.. ఇలా మీరు చేయగలిగితే మంచి ఫలితం పొందుతారు.
అయితే ఈ సామూహిక మరణాల వెనుక ఓ బాబా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ కుటుంబానికి మూఢనమ్మకాలు, క్షుద్రపూజల పట్ల విశ్వాసం ఉండేదని తరచూ బాబాలు, స్వామిజీలు కలుస్తారని బంధువులు చెబుతున్నారు.. ఈ క్రమంలోనే మోక్ష ప్రాప్తి కోసం ఓ బాబాను వీరు అనుసరిస్తున్నారని.. ఆయనే వీరిని బలవన్మరణానికి ప్రేరిపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.