ఢిల్లీ కేబినెట్ పదవులకు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా రాజీనామాలు చేయగా.. వాటిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు కొత్తవారిని కేబినెట్లోకి తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్లు వారి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమోదించారు. అయితే ఈ క్రమంలోనే మరో ఇద్దరు నేతలకు కేబినెట్లో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో నియమాకానికి సంబంధించి అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు పంపారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అతిషి, సౌరభ్ భరద్వాజ్లకు కేబినెట్ బెర్త్లు ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. గత ఏడాది మే నెలలో మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన శాఖల బాధ్యతలను కూడా సిసోడియా నిర్వహిస్తూ వచ్చారు. అయితే గత నెల 26న మనీష్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు అనుమతించిందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిసోడియా, సత్యేంద్ర జైన్ వారి పదవులకు రాజీనామా చేయగా.. కేజ్రీవాల్ వాటిని ఆమోదించి ఎల్జీకి పంపారు.
అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు.. మరో ఇద్దరిని కేబినెట్లో తీసుకురావాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతిషి, సౌరభ్ భరద్వాజ్లను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఎంపిక చేశారు.
