- Home
- Business
- August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్
August 1 Rule Changes: ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఎల్పీజీ ధరలు, తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్, బ్యాంక్ ఛార్జీలు, జీఎస్టీ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయో తెలుసా?
జులై నెల ముగుస్తోంది. ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదట్లో లాగే ఈసారి కూడా ఆగస్టు 1 నుంచి సాధారణ ప్రజల జేబులతో, నిత్య జీవితంతో ముడిపడిన పలు ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి. ఇందులో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల సవరణ నుంచి రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్, బ్యాంకింగ్ రుసుములు, జీఎస్టీ నియమాల వరకు అనేక మార్పులు ఉన్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచి అమలులోకి వచ్చే ఈ 5 ప్రధాన మార్పుల గురించిన వివరాలు గమనిస్తే..
1. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు
ప్రతి నెల మొదటి తేదీన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను సమీక్షించి ప్రకటిస్తాయి. జులై 1న ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తూ 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించాయి. అయితే 14 కిలోల ఇంట్లో వాడే వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంచాయి. ఇప్పుడు ఆగస్టు 1న కూడా ఆయిల్ కంపెనీలు ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఆగస్టు మొదటి తేదీ సమీక్షపైనే ఉంది. ధరలు కాస్త పెరిగే అవకాశముందని ఆయా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా హోమ్ డెలివరీ కానున్న ఎల్పీజీ సిలిండర్లు
ఇకపై గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ 'స్విగ్గీ ఇన్స్టామార్ట్' ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ను ఇంటికి తెప్పించుకోవచ్చు. దీనికోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా 10 కేజీల 'హెచ్పీ నవ్య' కాంపాక్ట్ సిలిండర్లతో పాటు 5 కేజీల మినీ సిలిండర్లను ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీ చేస్తారు. బ్యాచిలర్స్, విద్యార్థులు, చిన్న కుటుంబాలు అలాగే అపార్ట్మెంట్లలో నివసించే వారికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడనుంది.
2. ఏటీఎఫ్ రేట్ల సమీక్ష
ఎల్పీజీ తరహాలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన విమాన ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను కూడా సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్ రేట్లలో మార్పులు జరుగుతాయి. ఆగస్టు 1న ఏటీఎఫ్ ధరల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇంధన ధరల మార్పు ఆధారంగానే విమాన టికెట్ల ఛార్జీలపై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.
3. బ్యాంక్ సర్వీస్ ఛార్జీలలో మార్పులు
వచ్చే నెల అంటే ఆగస్టు 1 నుంచి పలు బ్యాంకులు తమ వినియోగదారులకు అందించే వివిధ సేవలపై వసూలు చేసే ఛార్జీలను మార్చబోతున్నాయి. ఇందులో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంక్ తమ ఖాతాదారులకు పంపే ఎస్ఎమ్ఎస్ అలర్ట్ ఛార్జీల్లో మార్పులను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీల ఛార్జీల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.
4. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు
రిపోర్టుల ప్రకారం.. భారతీయ రైల్వే ఆగస్టు 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పు తెచ్చే ఆలోచనలో ఉంది. కొత్త విధానం ప్రకారం, రిజర్వేషన్ కౌంటర్ వద్ద టోకెన్ ఇచ్చే సమయాన్ని తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభ సమయంతో కలిపి నిర్వహించనున్నారు. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. గతంలో ప్రజలు ముందుగా ఒక సమయానికి టోకెన్ తీసుకోవడానికి, ఆ తర్వాత టికెట్ బుక్ చేసుకోవడానికి వేర్వేరు సమయాల్లో కౌంటర్కు వెళ్లాల్సి వచ్చేది. ఈ కొత్త నిబంధనతో ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది.
5. జీఎస్టీ, ఈ-ఇన్వాయిస్ నిబంధనల్లో కీలక మార్పులు
రిపోర్టుల ప్రకారం, ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్లుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిల్-టు-షిప్-టు వాదేవీలకు సంబంధించి షిప్-టు జీఎస్టీఐఎన్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

