విషాదం: ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఉన్న అపార్ట్మెంట్ పై నుండి దూకి అనిస్సియా బత్రా అనే ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఉన్న అపార్ట్మెంట్ పై నుండి దూకి అనిస్సియా బత్రా అనే ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. బత్రా భర్త మయాంక్ సింఘ్వీ, అతని కుటుంబసభ్యులే ఆమెను చంపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
రెండేళ్ల క్రితం అనిస్సియాకు మయాంక్తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా మయాంక్ తప్పతాగి వచ్చి అదనపు కట్నం కోసం ఆమెను హింసిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతని తమ్ముళ్లు కూడా సహకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనిస్సియా తండ్రి ఆర్ఎస్ బత్ర కొన్నిరోజుల క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్తింటివాళ్లు తన కూతురిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై ఫిర్యాదు చేసిన రెండు రోజులకే బత్రా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
తనను గదిలో పెట్టి హింసిస్తున్నారని తన సోదరి తనకు ఫోన్ చేసిందని మృతురాలి సోదరుడు చెప్పారు. తనను రక్షించాలని మృతురాలు తనను కోరిందన్నారు. . ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమె భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన చెప్పారు.
ఆసుపత్రిలో బత్రాను చేర్పించిన కొద్దిసేపటికి మయాంక్ ఫోన్ చేసినట్టు మృతురాలి కుటుంబసభ్యులు చెప్పారు. తాము ఆసుపత్రికి వెళ్లేసరికి బత్రా మరణించిందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సీజ్ చేసిన గదిని మరో తాళం చెవితో తెరిచి మయాంక్ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మృురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.