దేశంలో కొత్త 21 సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త సైనిక్ స్కూళ్ల‌లో 7 డే స్కూళ్లుగా ప‌నిచేయ‌నుండ‌గా.. 14 మాత్రం రెసిడెన్షియ‌ల్ విధానంలో న‌డుస్తాయని కేంద్రం వెల్లడించింది.  

దేశంలో సైనిక్ స్కూళ్ల‌లో అడ్మిషన్ల కోసం ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే న‌డుస్తున్న సైనిక్ స్కూళ్లకు అద‌నంగా మ‌రో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ శ‌నివారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భాగ‌స్వామ్య ప‌ద్ద‌తిలో న‌డిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్ల‌లో 7 డే స్కూళ్లుగా ప‌నిచేయ‌నుండ‌గా.. 14 మాత్రం రెసిడెన్షియ‌ల్ విధానంలో న‌డుస్తాయని రక్షణ శాఖ ప్ర‌క‌టించింది. ఇకపోతే.. కొత్త‌గా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్ల‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఒక్కోటి చొప్పున మంజూర‌య్యాయి. ఏపీలోని క‌డ‌ప జిల్లాకు చెందిన పూజ ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ సైనిక్ స్కూల్‌గా మార‌నుంది. ఇక తెలంగాణలో క‌రీంన‌గ‌ర్‌కు చెందిన సోష‌ల్ వెల్ఫేర్ స్కూల్‌ను సైనిక్ స్కూల్‌గా తీర్చిదిద్ద‌నున్నారు.

ఈ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. కొత్త పాఠశాలలు ప్రస్తుతం వున్న సైనిక్ పాఠశాలలకు భిన్నంగా వుంటాయని రక్షణ శాఖ వెల్లడించింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడం, సాయుధ దళాలలో ప్రవేశాలు వంటి వాటి ద్వారా వారికి మెరుగైన కెరీర్ అవకాశాలను అందించం ఈ సైనిక్ స్కూల్స్ ఏర్పాటు వెనుక వున్న ముఖ్యోద్దేశం. నేటి యువతను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశ నిర్మాణానికి ప్రభుత్వంతో చేతులు కలపడానికి ప్రైవేట్ రంగానికి ఇది అవకాశం కల్పిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా ఆమోదం పొందిన సైనిక్ స్కూల్స్‌లో 2022 మే మొదటి వారం నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభం కానుంది. 

ఇకపోతే.. జనవరి 8న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక వెబ్‌నార్‌లో ప్రసంగించారు. సాయుధ దళాలలో చేరడానికి బాలికలకు అవకాశాలను కల్పించడానికి.. దేశంలో 100 కొత్త సైనిక్ పాఠశాలలను (Sainik Schools) ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.