జెఎన్ యులో దీపిక పడుకొనే: దాడికి గురైన విద్యార్థులకు మద్దతు
దీపిక పడుకొనే జెఎన్ యూను సందర్శించి, దాడికి గురైన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. సభలో ఆమె మాట్లాడకపోయినప్పటికీ కొంత మంది విద్యార్థులతో మాట్లాడుతూ కనిపించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి దీపిక పడుకొనే మంగళవారం సాయంత్రం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్ యు)ను సందర్శించారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారంనాడు విద్యార్థులపై, టీచర్లపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపిక పడుకొనే విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దాడికి గురైన వారికి మద్దతు ప్రకటించారు.
also read:మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాలా: జేఎన్యూ దాడి మా పనే
విశ్వవిద్యాలయంలో ఆమె ఒక్క మాట్లాడలేదు. కానీ దాడికి గురైన విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తో పాటు ఇతర విద్యార్థులతో కలిసి నిలబడడం కనిపించింది. మాజీ విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ కూడా వారితో ఉన్నారు.
విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి ఆమె విశ్వవిద్యాలయాన్ని సందర్శించినట్లు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటలకు ఆమె విశ్వవిద్యాలయానికి వచ్చారు. బహిరంగ సభలో దాదాపు 15 నిమిషాలు ఉన్నారు.
ఆ తర్వాత కొద్ది మంది విద్యార్థులు మాట్లాడారు. పడుకొనే విశ్వవిద్యాలయ సందర్శన వివాదాన్ని సృష్టించింది. ఆమె సినిమాలను బహిష్కరించాలని బిజెపి పిలుపునిచ్చింది.