Asianet News TeluguAsianet News Telugu

Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..

Cyclone Michaung : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో ( డిసెంబర్ 3వ తేదీ) తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనిని మైచౌంగ్ తుఫాన్ అని పిలుస్తున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని కోస్తా, పలు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా వానలు పడుతాయని అంచనా వేసింది. 
 

Cyclone Michaung : The low pressure that will turn into a storm in the next two days.. where will it cross the coast..?..ISR
Author
First Published Dec 1, 2023, 12:23 PM IST

weather update : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ పుదుచ్చేరికి ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది.

Mother Dead Body : తల్లి శవంతో ఏడాదిగా ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్లు.. ఎందుకంటే ?

దీనికి మయన్మార్ మైచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) అని పేరు పెట్టింది. ఈ తుఫాను డిసెంబర్ 4 తెల్లవారుజామున తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఈ తుఫాన్ వల్ల ఒడిశాపై పెద్దగా ప్రభావం చూపకపోనప్పటికీ.. డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 6 వరకు మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కోస్తా ఒడిషాలోని మిగిలిన జిల్లాలు, నబరంగ్పూర్, కలహండి, నువాపాడా, కంధమాల్లలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

 

కాగా.. ఈ తుపాను ప్రభావంతో నేటి (డిసెంబర్ 1) ఉదయం నుంచి నైరుతి బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, డిసెంబర్ 2 ఉదయం నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3వ తేదీ ఉదయం నుంచి 24 గంటల పాటు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 2 సాయంత్రం నుంచి గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, డిసెంబర్ 3 ఉదయం నుంచి 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో డిసెంబర్ 3 ఉదయం నుంచి 24 గంటల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది.

విషాదం.. ఆయుర్వేద సిరప్ తాగి 5 గురు మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత..

కాగా..  మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో నేటి నుంచి (డిసెంబర్ 1) నైరుతి బంగాళాఖాతం, డిసెంబర్ 2 నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నేటి వరకైనా తీరానికి తిరిగి రావాలని ఐఎండీ కోరింది.

ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో, కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో నేటి (శుక్రవారం) నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 4వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ సమయంలో గంటకు 65 నుంచి 115 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios