ప్రజల వద్ద రెట్టింపు నగదు


న్యూఢిల్లీ: నోట్ల రద్దు కాలం నాటి కంటే ప్రస్తుతం దేశంలోని ప్రజల వద్ద అంతకంటే రెట్టింపు నగదు చలామణిలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది.సుమారు రూ.18.5 లక్షల కోట్లు నగదు ప్రజలు చలామణి చేస్తున్నారని ఆర్బీఐ ప్రకటించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సాధారణంగా మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల వద్ద ఉన్న నగదును తీసేసి ప్రజల వద్ద ఉన్న కరెన్సీని లెక్కిస్తారు. దేశంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ. 18.5లక్షల కోట్లకు చేరింది. 2016 నవంబరులో నోట్ల రద్దు చేసిన తర్వాత ప్రజల వద్ద రూ. 7.8లక్షల కోట్ల కరెన్సీ ఉంది. ఇప్పుడు అది రెట్టింపుకు పైగా పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది.

ఇక ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ విలువ కూడా పెరిగింది. నోట్ల రద్దు తర్వాత రూ. 8.9లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేది. ప్రస్తుతం అది రూ. 19.3లక్షల కోట్లకు పెరిగింది.

 నోట్ల రద్దు సమయంలో మొత్తం రూ. 15.44లక్షల కోట్ల విలువైన రూ. 500, రూ. 100 నోట్లు చలామణిలో ఉన్నాయి. జూన్‌ 30, 2017 నాటికి రూ. 15.28లక్షల కోట్లు తిరిగి బ్యాంకులను చేరాయి. నోట్ల రద్దు తర్వాత రూ. 2000, రూ. 200, రూ. 500 కొత్త నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తెచ్చింది.