బీహార్లో వింత దొంగలు.. ఏకంగా రైల్వే ట్రాక్ నే ఎత్తుకెళ్లి.. స్కాప్ కింద అమ్ముకున్నారు..
ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో కోట్ల విలువైన రైల్వే స్క్రాప్ను స్క్రాప్ డీలర్కు విక్రయించారు కొంతమంది దొంగలు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీహార్ లో చర్చనీయాంశంగా మారింది.
బీహార్ : కాదేదీ దొంగతనానికి అనర్హం అని నిరూపించారు దొంగలు. ఏకంగా రైల్వై ట్రాక్ నే ఎత్తుకెళ్లిపోయి అమ్మేసుకున్నారు. ఆ ట్రాక్ చాలాకాలంగా ఉపయోగంలో లేదు. దీంతో ఇదే అదనుగా భావించిన దొంగలు ఆర్పీఎఫ్ వారితో చేతులు కలిపి ఏకంగా రైల్వే ట్రాక్ నే ఎత్తేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీహార్ లో కలకలం చెలరేగింది. దీనిమీద ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఇద్దరు ఉద్యోగుల మీద వేటు వేశారు. విచారణ చేపట్టారు.
బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్లో రైల్వే ట్రాక్ కనిపించకుండా పోయిన స్క్రాప్ స్కామ్ కేసు తెరపైకి రావడంతో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) సిబ్బందిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో కోట్ల విలువైన రైల్వే స్క్రాప్ను స్క్రాప్ డీలర్కు విక్రయించారు.
విమానాల్లో వికృత చేష్టలు: 2022 నుంచి 'నో ఫ్లై లిస్ట్'లో 63 మంది ప్రయాణికులు
దీనిమీద సమస్తిపూర్ రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ.. విచారణ కోసం డిపార్ట్మెంటల్ స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, కేసు గురించి డిపార్ట్మెంట్కు సమయానికి తెలియజేయనందుకు మధుబని రైల్వే డివిజన్కు చెందిన ఝంజర్పూర్ ఆర్పిఎఫ్ అవుట్పోస్ట్ ఇన్చార్జి శ్రీనివాస్, జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్తో సహా ఇద్దరు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
"రైల్వే లైన్ స్క్రాప్ను వేలం వేయకుండా ఆర్పిఎఫ్ సహకారంతో స్క్రాప్ డీలర్కు విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయంపై రైల్వే శాఖలో కలకలం చెలరేగింది" అని అగర్వాల్ అన్నారు. సమస్తిపూర్ రైల్వే డివిజన్లోని పాండౌల్ స్టేషన్ నుండి లోహత్ షుగర్ మిల్లు వరకు రైల్వే లైన్ వేశారు. అయితే ఇది చాలా కాలంగా ఉపయోగంలో లేదు. ఈ వ్యవహారంపై దర్బంగా ఆర్పిఎఫ్ పోస్ట్, రైల్వే విజిలెన్స్ బృందం దర్యాప్తు చేస్తోంది.