మరో ఎమ్మెల్యేను బలితీసుకున్న కరోనా మహమ్మారి
కేరళలోని కొంగడ్ నియోజకవర్గం నుండి సిపిఎం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేవీ విజయదాస్(61) కరోనాతో మరణించారు.
తిరువనంతపురం: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటం, వ్యాక్సిన్ రాకతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఈ మహమ్మారి భయం తగ్గతోంది. అలాంటి సమయంలో ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న ఓ ఎమ్మెల్యే తాజాగా మృతిచెందాడు. ఈ విషాదం కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని కొంగడ్ నియోజకవర్గం నుండి సిపిఎం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేవీ విజయదాస్(61)కు ఇటీవలే కరోనా సోకింది. దీంతో రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి ఇవాళ(మంగళవారం) మృతిచెందారు.
ఎమ్మెల్యే విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. సీపీఎం నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే విజయదాస్ కు భార్య ప్రేమకుమారి, ఇద్దరు కుమారులు జయదీప్, సందీప్ ఉన్నారు.