‘నాకు ఎవరూ చెప్పలేదు’.. పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య..!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను పద్మభూషణ్కు ఎంపిక చేసింది. అయితే బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మాత్రం సంచలన ప్రకటన చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను పద్మభూషణ్కు ఎంపిక చేసింది. అయితే బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మాత్రం సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. పద్మభూషణ్ అవార్డు రావడంపై తనకేమీ తెలియదనీ.. దీనిగురించి ఎవరూ తనకు చెప్పలేదన్నారు. ఒకవేశ తాను పద్మ పురస్కారానికి ఎంపికైతే తాను దానిని తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి సీపీఎం పార్టీ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది.
పార్టీ నిర్ణయం, బుద్ధదేవ్ భట్టాచార్య ఇదేనని పేర్కొంది. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బుద్ధదేవ్ భట్టాచార్య దానిని స్వీకరించడానికి నిరాకరించారని పేర్కొంది. తమ పని ప్రజల కోసమేనని.. అవార్డుల కోసం కాదని తెలిపింది.
పద్మభూషణ్ పురస్కారం గురించి ముందుగానే బుద్ధదేవ్ భట్టాచార్య భార్యకు తెలియజేశామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అవార్డు గురించి కేంద్ర హోం కార్యదర్శి బుద్ధదేవ్ భట్టాచార్య భార్యతో మాట్లాడారని.. ఆమె అవార్డును స్వీకరించి కృతజ్ఞతలు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక, మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారు.
పద్మ అవార్డుల తిరస్కరణ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గ్రహీతలు అవార్డుల ప్రకటనకు ముందు అంగీకారాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఇక, ఈ ఏడాది కేంద్రం నలుగురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, బెంగాల్ నుంచి బుద్ధదేవ్ భట్టాచార్యతో పాటు పలువురు ప్రముఖులకు పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించింది.