బీహార్ లో జేడీ(యూ)-ఆర్జేడీ ప్రభుత్వానికి 12 అసెంబ్లీ స్థానాలు ఉన్న సీపీఐ-ఎంఎల్ బయటి నుంచి మద్దతు ప్రకటించింది. అయితే తాము మంత్రి పదవులను తీసుకోబోమని స్పష్టం చేసింది.
బీహార్లో ఇటీవల ఏర్పాటు అయిన కొత్త జేడీ(యూ)-ఆర్జేడీ ప్రభుత్వానికి సీపీఐ-ఎంఎల్ బయటి నుంచి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎం నితీశ్ కుమార్ను కలిశానని, మహాకూటమి ప్రభుత్వాన్ని నడపడానికి కనీస ఉమ్మడి కార్యక్రమం (ఎంసీపీ) రూపొందించాలనే డిమాండ్ ను ముందు ఉంచానని చెప్పారు. రాష్ట్ర కార్యవర్గంలో పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
రాష్ట్రాలు ఆర్థిక సామర్థ్యాలకు మించి ‘ఉచితాలు’ ఇవ్వకూడదు - నీతి ఆయోగ్ మాజీ వీసీ రాజీవ్ కుమార్
“ మేము బీహార్లో ఏడు పార్టీల ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, ఎందులోనూ మంత్రి పదవిని తీసుకోలేదు. బీహార్ సీఎం నితీష్ దేశ ప్రయోజనాల కోసం సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం ” అని దీపాంకర్ భట్టాచార్య అన్నారు. “ బీహార్లో బీజేపీ బుల్డోజర్కు పెద్ద నష్టం జరిగింది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి నితీష్ కూడా బాధ్యత వహించారు ’’ అని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా దీపాంకర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. నితీశ్ భుజంపై తుపాకీ పెట్టుకుని బీహార్లో కాషాయ పార్టీ కాల్పులు జరుపుతోందని ఆరోపించారు. బీహార్ మహారాష్ట్ర ప్రతీకారం తీర్చుకుందని, ఏడు పార్టీల మహాకూటమి జాతీయ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం తీరుస్తుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. “ ఏ ప్రతిపక్ష ప్రభుత్వమూ తన పదవీకాలాన్ని పూర్తి చేయడం బీజేపీకి ఇష్టం లేదు. బీహార్లో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తోంది ’’ అని అన్నారు.
ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఐ-ఎంఎల్ 19 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఇందులో 12 స్థానాలు గెలుచుకుంది. బీహార్ అసెంబ్లీలో సీపీఐ-ఎంఎల్తో పాటు సీపీఐ, సీపీఎంలకు రెండేసి స్థానాలు ఉన్నాయి. నితీష్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత వారం నితీశ్ సీఎంగా, ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 16వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
శనివారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తేజస్వి నితీష్ని ఆయన నివాసంలో కలుసుకుని మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తేజస్వి తన తండ్రి, ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్తో సమావేశానికి ముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు.
