రాష్ట్రాలు ఆర్థిక సామర్థ్యాలకు మించి ‘ఉచితాలు’ ఇవ్వకూడదు - నీతి ఆయోగ్ మాజీ వీసీ రాజీవ్ కుమార్
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఉచిత పథకాల హామీలు ఇవ్వకూడదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. పీటీఐకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక సామర్థ్యాలకు మించి బహుమతులు, వినియోగ వస్తువులు వంటి ‘‘నాన్-మెరిట్ ఫ్రీబీలను’’ ఇవ్వకూడదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. మెరిట్ బదిలీ చెల్లింపు, నాన్-మెరిట్ ఫ్రీబీల మధ్య వ్యత్యాసం ఉందని చెప్పారు. ‘‘ బహుమతులు, వినియోగ వస్తువులను ఇచ్చే స్వభావం కలిగినవి నాన్-మెరిట్ ఫ్రీబీలు..వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్థిక పరిమితులు ఉన్న ప్రభుత్వాలు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదు ’’ అని ఆయన అన్నారు. ఆయన ‘పీటీఐ’కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు పంచుకున్నారు.
ప్రజాస్వామ్యంలో పన్నులు, పంపిణీ సాధనం ద్వారా ప్రభుత్వం చెల్లింపులను బదిలీ చేయడం ఎప్పుడూ అవసరమని పేర్కొన్నారు. శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని భారత్తో పోల్చిన కొంతమంది రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై కుమార్ స్పందిస్తూ.. అలాంటి ఏదైనా పోలిక కేవలం అసంబద్ధమైనది అన్నారు. నార్డిక్ దేశాలలో పన్ను, GDP నిష్పత్తి దాదాపు 50 శాతంగా ఉందని అన్నారు. ఎందుకంటే వారు సామాన్యులకు ప్రజా వస్తువులు, సేవలను అందించడానికి చాలా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారని తెలిపారు.
దీనిని మనం చర్చించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని చెప్పారు. సామాన్యులకు, ముఖ్యంగా పిరమిడ్ దిగువన ఉన్నవారికి ప్రజా వస్తువులు, సేవల నాణ్యత, ప్రాప్యతను పెంచడం చాలా ముఖ్యం అని అన్నారు. నీతి ఆయోగ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించాలని కుమార్ ను కోరగా.. అవి కేసీఆర్ అభిప్రాయాలని అన్నారు. ‘‘ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దాదాపు అందరు సీఎంలు వచ్చి రోజంతా గడిపారు. ఇది వాస్తవం. అయితే తెలంగాణ సీఎం చెప్పిన అంశం మిగితా ఏ సీఎంలు అనలేదని స్పష్టం అవుతోంది.’’ అని కుమార్ నొక్కి చెప్పారు.భారతదేశం ఏ సమయంలోనైనా మాంద్యంలోకి వస్తుందనే భయం లేదని ఆయన అన్నారు.
ఇన్స్టా పరిచయంతో సహజీవనం.. పాట్నర్ను కత్తితో పొడిచిన యువతి.. అసలేం జరిగిందంటే..
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఓ సందర్భంలో 'రివారీ' (ఉచితాలు) లు పెంచుతూ పోవడం మంచిది కాదని అన్నారు. ఇవి పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ (స్వయం-ఆధారం)గా మారడానికి భారతదేశం డ్రైవ్కు ఆటంకం కలిగించే ఆర్థిక విపత్తు కూడా అని వ్యాఖ్యానించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అలాగే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్, నీటి వాగ్దానం వంటి హామీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
దీంతో దేశంలో ఉచిత పథకాలపై చర్చ ప్రారంభమైంది. కాగా.. ఇదే అంశంపై శనివారం కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ’ఉచితాలను’ ప్రకటించే ముందు తగిన బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బలాన్ని చూసుకోవాలని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఉచితాలు ఎలా ఉండవచ్చనే దృక్పథాన్ని తప్పనిసరిగా కల్గి ఉండాలని, అలాగే తగినంత ఆర్థిక బలం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. అలాగే తగినంత ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోకుండా ఉచితాల కోసం నిబంధనలు రూపొందించడం వల్ల భవిష్యత్ తరాలపై భారం పడుతుందని ఆమె అన్నారు.