2021 కంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ను అభివృద్ది చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.


న్యూఢిల్లీ: 2021 కంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ను అభివృద్ది చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

తొలి రెండు దశల్లో  ప్రాథమిక పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారన్నారు. . వ్యాక్సిన్‌ పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షించే మూడో దశే అత్యంత కీలకం, కఠినమైనదని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రమే క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నట్టుగా తెలిపారు. 

also read:కరోనాకు అధిక ఫీజులు:ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

కరోనా నివారణకు గాను వ్యాక్సిన్ అందుబాటులోకి రానందున పేషేంట్ల చికిత్సకు రెమిడిసివిర్ వంటి మందులను ఉపయోగిస్తున్నారు. అయితే అది పూర్తిస్థాయిలో మరణాలను కట్టడి చేస్తోందనే విషయమై స్పష్టత లేదన్నారు. 

ఇక ఆగష్టు 15 నాటి భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్న ఐసీఎంఆర్‌ ప్రకటనపై స్పందించారు. ట్రయల్స్‌ నిర్వహించడానికి చాలా సమయం పడుతుందన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్‌ ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు ఐసీఎంఆర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని​ వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది