దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, కర్నాటకలో ఇద్దరు మృతులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో మరోసారి కరోనా కేసులు చుట్టుముట్టుతున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలలో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఇక తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం కేరళలో 273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వైద్య శాఖ అధికారుల ప్రకారం, కొత్తగా వచ్చిన కేసులు గత వారం రోజుల్లోనే వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులో 66 యాక్టివ్ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 56 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు ఉన్నట్లు డేటా చెబుతోంది.
కర్నాటకలోనూ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరును కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో 36 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాల్లో కరోనా కారణంగా మృతులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 21 ఏళ్ల యువకుడు కరోనా వల్ల మరణించాడు. అతనికి ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోయినా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ కేసులు మళ్లీ పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, హైజీన్ పాటించడం, బూస్టర్ డోస్ తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.