మాజీ ప్రధాని మన్మోహన్ సింగన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నంసించారు. మన్మోహన్ సిగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించి భారతదేశం ఆయనకు రుణపడి ఉంటుందని అన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నంసించారు. మన్మోహన్ సిగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు సంబంధించి భారతదేశం ఆయనకు రుణపడి ఉంటుందని అన్నారు. ఢిల్లీలో జరిగిన టీఐవోఎల్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. దేశంలోని పేదలకు కూడా మేలు చేయాలంటే భారతదేశానికి ఉదారవాద ఆర్థిక విధానం అవసరం అని గడ్కరీ చెప్పారు. 

1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికిన భారత్‌కు కొత్త దిశానిర్దేశం చేశాయని గడ్కరీ అన్నారు. ఈ ఆర్థిక సంస్కరణల సంబంధించి దేశం ఆయనకు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. తాను 90వ దశకంలో మహారాష్ట్రలో మంత్రిగా పనిచేశానని.. ఆ సమయంలో రోడ్ల నిర్మాణానికి డబ్బులు సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్లనే తాము రోడ్ ప్రాజెక్టులకు నిధులు సేకరించగలిగామని చెప్పారు. 

ఉదారవాద ఆర్థిక విధానం రైతులు, పేద ప్రజల కోసం అని గడ్కరీ స్పష్టం చేశారు. ఉదారవాద ఆర్థిక విధానం దేశ అభివృద్దికి ఎంతగా దోహదపడుతుందో చెప్పడానికి చైనా మంచి ఉదాహరణ అని అన్నారు. భారతదేశ విషయానికి వస్తే.. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి దేశంలో ఎక్కువ మూలధన వ్యయ పెట్టుబడి అవసరమని ఆయన అన్నారు. అందువల్ల జాతీయ రహదారుల అధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కూడా హైవేల నిర్మాణానికి సామాన్యుల నుంచి నిధులు సమీకరిస్తోందని చెప్పారు. 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 26 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తోందని.. తమ శాఖకు నిధుల కొరత లేదని గడ్కరీ చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ టోల్ ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 40,000 కోట్ల నుంచి 2024 నాటికి రూ. 1.40 లక్షల కోట్లు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.