Asianet News TeluguAsianet News Telugu

మ‌ళ్లీ క‌రోనా పంజా: అప్ర‌మ‌త్త‌మై రాష్ట్రాలు.. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు

New Delhi: ఇత‌ర దేశాల్లో అత్య‌ధిక వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 వేరియంట్లు మ‌న దేశంలో గుర్తించిన త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క‌రోనా ప‌రిస్థితుల‌పై సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం గురువారం నాడు కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వ‌హిస్తున్నారు.
 

Coronavirus updates: States on alert; Orders issued making Covid guidelines mandatory
Author
First Published Dec 22, 2022, 12:53 PM IST

Coronavirus updates: ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెర‌గుతున్నాయి. జ‌పాన్, చైనా, అమెరికా, స‌హా ప‌లు ఆసియా దేశాల్లో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ఇటీవ‌ల గుర్తించిన కొత్త వేరియంట్లే కార‌ణ‌మ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నాయి. తాజాగా సంబంధిత వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన క‌రోనా ప‌రిస్థితుల‌పై సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం గురువారం నాడు కోవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం క‌రోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నాయి. 

రాష్ట్రానికి వచ్చే ప్ర‌యాణీకుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి..: గుజ‌రాత్

కొన్ని దేశాల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుండి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు తప్పనిసరిగా నిర్వహించాలని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ అధికారులను ఆదేశించారు. చైనాలో క‌రోనా క‌ల్లోలానికి కారణమవుతున్నట్లు అనుమానిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 సబ్ వేరియంట్  కేసులు రాష్ట్రంలో గుర్తించిన త‌ర్వాత ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. 

కేర‌ళ‌.. 

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే బీఎఫ్.7 ఒమిక్రోన్ వేరియంట్ నాలుగు కేసులను దేశంలో గుర్తించిన త‌ర్వాత‌.. కేర‌ళ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 391 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 540 మంది చికిత్స పొందుతున్నారనీ, డిసెంబర్లో 1,431 మందికి పాజిటివ్ వచ్చిందని వార్తా నివేదికలు తెలిపాయి. ఆరోగ్య శాఖ ప్రకారం, ఈ సంఖ్యలు ఆందోళన కలిగించవు..భయపడాల్సిన అవసరం లేదు. అయితే, సెలవుల సమయంలో ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించింది.

కోవిడ్ మార్గదర్శకాలను జారీచేసిన ఉత్త‌రప్ర‌దేశ్..

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకుంటూ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరిక జారీ చేసింది. అలాగే, కేసులు పెరిగితే సంసిద్ధతను పెంచింది. రాష్ట్రంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆదేశించారు. "మాస్క్ ధరించడం ద్వారా మాత్రమే బయటకు వెళ్లండి- జాగ్రత్త వహించండి. ఆదేశాలను త‌ప్ప‌కుండా పాటించండి' అని పేర్కొన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స‌మీక్ష‌.. 

కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 పరిస్థితిపై ఢిల్లీ ప్రభుత్వం నిఘా ఉంచిందనీ, నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ కు నిర్ధారించాలనీ, ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన ఇతర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆరోగ్య శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా గురువారం ఈ సమావేశంలో పాల్గొంటారు. 'ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. కరోనా వైరస్ కు సంబంధించి సీఎం కేజ్రీవాల్ రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయ‌నున్నారు' అని ఓ అధికారి బుధవారం (డిసెంబర్ 21) తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios