కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఈ మార్చి నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఐసీఎంఆర్ ఉన్నతాధికారులు, నిపుణులు తెలిపారు. ప్రస్తుతం రోజు వారి కరోనా కొత్త కేసులుగా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. 

భారతదేశంలో కోవిడ్ -19 (covid -19) కేసులు తగ్గుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి మొదలైన థర్డ్ వేవ్ (third wave) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే ఇది మార్చి నాటికి ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం మహారాష్ట్ర (maharasta), ఢిల్లీ (delhi), పశ్చిమ బెంగాల్‌ (west bengal)తో సహా అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గింది. మొత్తంగా భార‌త్ లో ఉన్న కోవిడ్ -19 యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 14.35 లక్షలకు పడిపోయింది.

ఈ నెల ఆఖ‌రు నాటికి దేశంలోని చాలా ప్రాంతాల్లో థ‌ర్ద్ వేవ్ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర‌న్ పాండా (sameeran panda) ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గ‌రిష్ట స్థాయి నుంచి దిగ‌జారుతుంద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి కేసులు మార్చి రెండో లేదా మూడో వారం నాటికి పూర్తిగా త‌గ్గ‌వ‌చ్చ‌ని మ‌హారాష్ట్ర హెల్త్ మినిస్ట‌ర్ ఆరోగ్య మంత్రి రాజేష్ తోపె (Rajesh thope) అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. ముంబై (mumbai), పూణే (pune), థానే (thane), రాయ్‌గఢ్ (rayghad)వంటి ప్రధాన నగరాల్లో ఇన్ఫెక్షన్ త‌క్కువ‌గా న‌మోదు అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలో రోజుకు 48,000 కేసులు న‌మోద‌య్యేవని కానీ ప్ర‌స్తుతం రోజు వారి కేసుల సంఖ్య 15,000కి త‌గ్గాయ‌ని ఆయ‌న తెలిపారు. 

గ‌తంలో క‌రోనా తీవ్ర‌త అంచ‌నా వేసిన సూత్ర మోడల్ ప్ర‌కారం మార్చి రెండో వారం నాటికి రోజు వారి కేసులు 10వేల కంటే త‌క్కువ‌గానే న‌మోద‌వుతాయ‌ని చెప్పింది. ఐసీఎంఆర్ (ICMR), ఇంపీరియల్ కాలేజ్ లండన్ (imperial college london)లు సంయుక్తంగా వెల్ల‌డించిన అంచ‌నాల ప్ర‌కారం ఈ ఏడాది మార్చి మ‌ధ్య‌లో వ‌ర‌కు భార‌త‌దేశంలో కేసులు సాధార‌ణ స్థితికి చేరుకుంటాయి. అయితే కొత్త వేరియంట్ లు ఏవీ వెలుగులోకి రాకుండా ఉంటేనే ఈ అంచ‌నాల ప్ర‌కారం కేసులు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని పేర్కొన్నాయి. 

ఇది ఇలా ఉండ‌గా.. గడిచిన 24 గంటల్లో దేశం వ్యాప్తంగా కొత్తగా 1,27,952 కరోనా కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేర‌కు శ‌నివారం హెల్త్ బులిటెన్ (health buliten) విడుద‌ల చేసింది. అంతకు ముందు రోజు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ లో న‌మోదైన కేసుల‌తో పోలిస్తే 14 శాతం తక్కువగా కేసులు వెలుగుచూశాయి. క‌రోనా వ‌ల్ల గ‌డిచిన 24 గంట‌ల్లో 1,059 మంది చ‌నిపోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరుకుంది. క‌రోనా నుంచి 2,30,814 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 4,02,47,902కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు (positiviry rate) 7.98 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 11.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.64 శాతంగా న‌మోదైంది.