మరోసారి పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
చైనాలో కరోనా మరోసారి ప్రకంపనలు సృష్టించింది. అనేక ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించింది. మహమ్మారి పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం సమీక్షించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ , దాని సబ్ వేరియంట్లు ప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించింది కేంద్రం. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్నింగ్కు పంపాలని సూచించింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా ఎన్సీడీసీ, ఐసీఎంఆర్లకు లేఖ పంపారు. జీనోమ్ సీక్వెన్సింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ లేఖలో సూచించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి బుధవారం (డిసెంబర్ 21) ఉదయం 11 గంటలకు కరోనాపై సమీక్ష సమావేశాన్ని కూడా పిలిచారు. కరోనా కొత్త వేరియంట్ జన్యు పరీక్ష ద్వారా తెలుస్తుంది. జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, పాజిటివ్ కేసుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలకు,కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితులు మామూలే..
కరోనాకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. గత 24 గంటల్లో దేశంలో 112 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ కారణంగా 12 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య 3490కి తగ్గింది. గత మూడు రోజులుగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మార్చి 2020 తర్వాత రోజువారీ మరణాల పరంగా ఇది అతి తక్కువ కావడం గమనార్హం. గత వారంలో 1103 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. డేటా ప్రకారం..గత వారంలో (డిసెంబర్, 12-18) గత ఏడు రోజుల్లో కరోనా కేసులలో 19% తగ్గుదల నమోదైంది.