ఒడిషా : గూడ్స్ను ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ప్రెస్.. పట్టాలు తప్పిన 5 బోగీలు, వందల మందికి గాయాలు
చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్లో ఆగివున్న గూడ్స్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
ఒడిశాలో రైలు ప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్లో ఆగివున్న గూడ్స్ను ఢీకొట్టింది. బాలాసోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 5 బోగీలు పట్టాలు తప్పగా, వందల మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంద. ప్రమాదం దాటికి బోగీలు పల్టీలు కొట్టగా.. ప్రయాణీకులు చెల్లాచెదురుగా పడిపోయారు. చిమ్మ చీకటి కావడంతో ప్రయాణీకులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, ఇతర సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సహాయక చర్యల కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.
షాలిమార్ : 9903370746
ఖరగ్పూర్ : 8972073925, 9332392339
బాలేశ్వర్ : 8249591559, త7978418322
హౌరా : 033-26382217
క్షతగాత్రుల కోసం 60 అంబులెన్స్లను అధికారులు సిద్ధం చేశారు. అలాగే బాలేశ్వర్లోని మెడికల్ కాలేజ్లు, ఆసుపత్రులకు చెందిన సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.
రైలు ప్రమాదంపై మమత దిగ్భ్రాంతి:
కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రైలులో బెంగాల్కు చెందిన వారు భారీగా వుంటారని , వారి క్షేమ సమాచారం కోసం ఒడిషా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని మమత తెలిపారు. ఇప్పటికే హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. 033-22143526, 22535185 నెంబర్లను సంప్రదించాలని మమతా బెనర్జీ కోరారు. ఘటనాస్థలికి బెంగాల్ నుంచి అధికారులను పంపామని.. సీఎస్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి సహాయక కార్యక్రమాలపై తాను వ్యక్తిగతంగా సమీక్షిస్తానని మమత వెల్లడించారు.