రోజురోజుకూ హిజాబ్ వివాదం ముదురుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు కర్ణాటకలోని శివమొగ్గలో 58 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు.
బెంగళూరు : Karnatakaలో Hijab వివాదం కొనసాగుతోంది. హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58మంది విద్యార్థులను shivamoggaలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదటి నుంచి హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు.
అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హై కోర్టు సూచించింది. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీని మీద సీరియస్ అయిన శివమొగ్గలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 58మందిని సస్పెండ్ చేసింది. అలాగే హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిమీద 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ముస్లిం వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదని ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. స్కూళ్లలో యూనిఫాం ధరించాలన్న గవర్నమెంట్ ఆర్డర్స్ రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అయితే హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా లేదా అన్నది తేల్చాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.
ఇదిలా ఉండగా, కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ వివాదం ఇప్పడు దేశ సమస్యగా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవహారం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. హిజాబ్ వివాదంపై వరుసగా ఆరో రోజు కర్ణాటక హైకోర్టు నిన్న విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అశ్వస్థీ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాడ్గీ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ఇస్లాం సంప్రదాయంలో హిజాబ్ తప్పనిసరికాదని, దీనిని నిషేధించడం రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను ఉల్లంఘించడం కాదని ప్రభులింగ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో విద్యా సంస్థల్లో హిజాబ్ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఆయన సమర్ధించారు. సమగ్రత, నమానత్వం, ప్రజాక్రమానికి భంగం కలిగించే వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ఫిబ్రవరి 5న జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధం కాదని ప్రభులింగ్ అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో హిజాబ్ సమస్య లేదని.. ఆ ఉత్తర్వులు ఏమాత్రం హానికరం కాదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తరగతి గదిలోకి హిజాబ్తో అనుమతించాలా? వద్దా? అని విద్యాసంస్థలు నిర్ణయించుకోవచ్చు అని ఏజీ వాదించారు. మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదని, లౌకికవాదం, ప్రజా సమగ్రతకు విరుద్ధమైన హిజాబ్ను అనుమతించరాదనేది ప్రభుత్వ వైఖరి ప్రభులింగ్ తేల్చిచెప్పారు. ఇదే సమయంలో హిజాబ్ అంశంపై ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించేలా ఉన్నాయన్న పిటిషినర్ల వాదనలను ఏజీ తోసిపుచ్చారు. మరోవైపు, ప్రజలు ప్రతిరోజూ ధరించే దుపట్టాలు, గాజులు, తలపాగాలు, శిలువలు, బొట్టు వరకూ వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నప్పుడు హిజాబ్ను ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని పిటిషనర్ తరఫున వాదించిన లాయర్లు.. న్యాయమూర్తులను ప్రశ్నించారు.
