పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్పై డిగ్గీ ప్రశ్నలు.. దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీలకు దేశభక్తి లేదన్న బీజేపీ
పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్లపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం అబద్ధాల మీదే నడుస్తున్నదని, ఏ విషయంపైనా ఆధారాలు చూపెట్టదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్లకు దేశ భక్తి అనేది లేకుండా పోయిందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్ అంశాలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఈ అంశాలపై మరోసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. వీటిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా, అసలు వారికి దేశభక్తే లేదని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
కాంగ్రెస్ సారథ్యంలో భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో కొనసాగుతుండగా ఈ పాదయాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పుల్వామాలో టెర్రరిజం చీడ ఎక్కువగా ఉండేది. ప్రతి కారును చెక్ చేసేవారు. కానీ, ఓ స్కార్పియో కారు రాంగ్ సైడ్ నుంచి వచ్చి బీభత్సం సృష్టించింది. అసలు ఆ కారును ఎందుకు చెక్ చేయలేదు? ఆ కారు ఆర్మీ వ్యాన్తో ఢీకొట్టింది. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ ఘటన వివరాలను పార్లమెంటులో వెల్లడించలేదు. బహిరంగ పరచలేదు’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. చాలా మంది ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. కానీ, అందుకు సంబంధించిన సాక్ష్యాలేవీ బయటపెట్టలేదని వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అబద్ధాల మీదనే నడుస్తున్నదని పేర్కొన్నారు.
Also Read: జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఘటనలు 168 శాతం తగ్గిపోయాయి: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
కాగా, ఈ కామెంట్లకు బీజేపీ రియాక్ట్ అయింది. బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ క్యారెక్టర్ అని విమర్శించారు. మన దేశ ఆర్మీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఏ భారతీయుడూ ఉపేక్షించబోరని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై వారికి ఉన్న ద్వేషం కారణంగా ఇప్పుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్లలో ఏ మాత్రం దేశ భక్తి లేకుండా పోయిందని పేర్కొన్నారు.