సారాంశం

పంజాబ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. మోగా నగరంలోని పోలీస్ స్టేషన్ మెహనా ఏరియా పరిధిలోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం  ఇద్దరు దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ నాయకుడ్ని కుటుంబసభ్యులు నగరంలోని మోగా మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందాడు.

పంజాబ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. మోగా నగరంలోని పోలీస్ స్టేషన్ మెహనా ఏరియా పరిధిలోని ఓ  స్థానిక కాంగ్రెస్ నాయకుడి నివాసంలోకి చొరబడి కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ అజిత్వాల్ బ్లాక్ ప్రెసిడెంట్ , డాలా గ్రామానికి చెందిన బల్జిందర్ సింగ్ బల్లి అనే స్థానిక నాయకుడి ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆ నాయకుడి ఇంటికి  అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. బల్లి అజిత్వాల్‌లో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

ఈ దారుణం జరిగిన కొన్ని గంటల తర్వాత కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ డల్లా .. హత్యకు బాధ్యత వహిస్తూ  వివరణాత్మకంగా ఫేస్‌బుక్ లో  పోస్ట్‌ చేశారు. బల్జిందర్ సింగ్ బల్లి తామే చంపామనీ, తను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించారు. తన తల్లి పోలీసు కస్టడీ ఉండటానికి కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇది ప్రతీకారం తీర్చుకునేలా ప్రేరేపించిందని ఆయన పేర్కొన్నారు. 

అర్ష్ దల్లా లిస్టెడ్ టెర్రరిస్ట్, అలాగే.. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA)మోస్ట్ వాంటెంట్ క్రిమినల్ కూడా.. గత మూడు, నాలుగేళ్లుగా కెనడా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అతడు పంజాబ్‌లో జరిగిన పలు ఉగ్రవాద హత్యలకు పాల్పడ్డాడు. బల్జీందర్ సింగ్ బల్లి తన ఇంట్లో హెయిర్‌కట్ చేయించుకుంటున్నాడు. కొన్ని పత్రాలపై సంతకం చేయమని గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఇది రొటీన్ విషయమని భావించారు.

ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బల్లిపై కాల్పులు జరిపారు. దాడి జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి దుండగులు పారిపోవడాన్ని CCTV చూపిస్తుంది. తీవ్రంగా గాయపడిన ఆయన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక అధికారులు అప్రమత్తమై, పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.