కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన శశిథరూర్ పై కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ చైర్మన్ మదుసూధన్ మిస్త్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయామ్ సారీ టు సే అంటూ శశిథరూర్ పై విమర్శలు గుప్పించారు. మా ముందు ఒకలా.. మీడియా ముందు మరోలా మాట్లాడారని ఆగ్రహించారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే అఖండ విజయం సాధించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని శశిథరూర్ కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఫలితాలు విడుదలై విజేత తేలిన తర్వాత మిస్త్రీ శశిథరూర్ పై విరుచుకుపడ్డారు. ఆయన విజ్ఞప్తులను స్వీకరించి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన ఎన్నికల అథారిటీ తనపై కుట్ర చేస్తున్నదని ఆరోపించడం దారుణం అని అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘మీ విజ్ఞప్తులను మేం స్వీకరించి అవసరమైన ఏర్పాట్లు చేశాం. అయినప్పటికీ మీరు మీడియా ముందుకు వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని ఆరోపణలు చేశారు’ అని మిస్త్రీ అన్నారు. ఎన్నికల కమిటీ ముందు ఒక ముఖం.. మీడియా ముందు మరో ముఖం ధరిస్తున్నారని విమర్శించారు. ‘తమ సమాధానాలతో సంతృప్తి చెందినట్టు మాకు చెబుతారు. మళ్లీ మీడియా ముందుకు వెళ్లి వేరే ముఖం ధరించి తమపైనే ఆరోపణలు చేస్తారు’ అని పేర్కొన్నారు.

Also Read: ఓడిన తర్వాత శశిథరూర్ ఏమన్నారు? పార్టీలో మార్పులపై కీలక వ్యాఖ్య

మిస్త్రీకి రాసిన లేఖలో శశిథరూర్ టీం నాలుగు ఫిర్యాదులు చేశారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయడం, పోలింగ్ బూత్‌లలో అనధికారులు ఉండటం, వోట్లు వేసేటప్పుడు నిబంధనలు తుంగలో తొక్కడం, పోలింగ్ షీట్లు లేకపోవడం అనే ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న పోలింగ్ జరగగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలో శశి థరూర్‌పై మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఈ మేరకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.