ఓడిన తర్వాత శశిథరూర్ ఏమన్నారు? పార్టీలో మార్పులపై కీలక వ్యాఖ్య
కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో ఓడిపోయిన శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్కరణలు కావాలంటే తనకు ఓటు వేయాలని, యథాతథంగా సాగాలంటే ఖర్గేకు వేయాలని ఆయన పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తాను రాసిన ఓ లేఖలోనూ ఈ సంస్కరణ విషయమై
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గెలుపొందారు. మొత్తం సుమారు 9500 ఓట్లుపడగా మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఓట్లు, శశిథరూర్కు 1,072 ఓట్లు పడ్డాయి. దీంతో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. రెండు దశాబ్దాలకుపైగా కాలం తర్వాత తొలిసారి గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించనున్నారు. మల్లికార్జున్ ఖర్గే గెలుపొందిన ప్రకటన వెలువడగానే శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ లెటర్ను ఆయన ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి గౌరవనీయమైన పదవి అని, బాధ్యతలు గల పదవి అని పేర్కొన్నారు. ఈ బాధ్యతలు తీసుకోబోతున్న మల్లికార్జున్ ఖర్గేకు అభినందనలు తెలిపారు. కాగా, తనకు సుమారు వెయ్యి మందికి పైగా పార్టీ సహచరుల నుంచి మద్దతు లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా దిగిపోతున్న సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం ఎంతో శ్రమించారని, ఆమె రుణం తీర్చలేనిదని పేర్కొన్నారు. అలాగే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలూ పార్టీ అభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషించారని తెలిపారు. గాంధీల కుటుంబం పార్టీకి ఎప్పుడూ వెన్నంటే ఉన్నదని, పార్టీ కోసం ఎప్పుడూ శ్రమించారని వివరించారు. కాబట్టి, ఇకపైనా వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ గాంధీ కుటుంబం కలకాలం నిలిచే ఉంటుందని తెలిపారు. అదే విధంగా తన పోల్ క్యాంపెయిన్ చేసిన సంస్కరణల డిమాండ్ పైనా స్పందించారు.
Also Read: ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:మల్లికార్జున ఖర్గే గెలుపు
పార్టీ యథావిధిగా కనసాగాలంటే ఖర్గేకు ఓటేసుకోండని, పార్టీలో ప్రక్షాళన చేయాలని భావిస్తే మాత్రం తనకు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఎన్నో సంస్కరణలు తేవాల్సి ఉన్నదని, అందుకోసమే తనకు ఓటు వేయాలని వివరించారు. తాజాగా, తన ప్రకటనలో ఈ ప్రస్తావన తెచ్చారు. అధికార పార్టీ, దాని అనుబంధ శక్తులు విలువలను హరించే దాడులు మొదలు పెట్టారని, వాటిని గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ల ఆదర్శాలతో ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు. ముందున్న సవాళ్లను తన కాంగ్రెస్ సహచరులతో కలిసి ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అదే విధంగా.. పార్టీలో మార్పులు నిజంగా ఈ రోజే మొదలయ్యాయని తాను నమ్ముతున్నట్టు వివరించారు. పార్టీలో పునరిజ్జీవం పొందడం ఇవాళ్టి నుంచే మొదలైందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
పార్టీలో ఎన్నికల కోసం సోనియా గాంధీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఇంతకు ముందే ప్రస్తావించారు. ఎట్టకేలకు పార్టీ అధినేతను ఎన్నుకుంటున్న పార్టీలో ఉండటం సంతోషంగా ఉన్నదని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.