పంజాబ్ కాంగ్రెస్లో మరో కుదుపు: హరీశ్ రావత్పై హైకమాండ్ వేటు... హరీశ్ చౌదరికి బాధ్యతలు..?
పంజాబ్ కాంగ్రెస్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా చన్నీ ఎంపిక, ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామాలతో అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది
పంజాబ్ కాంగ్రెస్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా చన్నీ ఎంపిక, ఆ తర్వాత పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామాలతో అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది. తాజాగా పంజాబ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిని మారుస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇన్ చార్జిగా ఉన్న హరీశ్ రావత్ స్థానంలో రాజస్థాన్ రెవెన్యూ శాఖ మంత్రి హరీశ్ చౌదరిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పందించిన ఆయన.. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్ నియామకంతో పార్టీలో ఘర్షణ వాతావరణం సద్దుమణిగిందనుకున్నా.. ఆ తర్వాత మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ నుంచి తప్పుకుంటాననడం, పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం వంటి పరిణామాలతో హైకమాండ్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరిశీలకుడిగా హరీశ్ చౌదరిని అధిష్ఠానం నియమించింది. సీఎం, సిద్ధూ మధ్య రాజీ కుదర్చడంలో హరీశ్ చౌదరి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ లో పార్టీ వ్యవహారాలను హరీశ్ చౌదరికి అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది