కాంగ్రెస్ డీఎన్ఏ పాకిస్థాన్కు అనుకూలంగా ఉంటుంది - ‘సర్జికల్ స్ట్రైక్’వ్యాఖ్యలపై శివరాజ్ సింగ్ చౌహాన్
కాంగ్రెస్ డీఎన్ఏ ఎప్పుడూ పాకిస్థాన్ కు అనుకూలంగా ఉంటుందని బీజేపీ నాయకుడు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ సైనికులను నిరుత్సాహపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు.
పాకిస్థాన్పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్పై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మంగళవారం మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ పాకిస్థాన్ కు అనుకూలంగా ఉంటుందని అన్నారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు భారత సైన్యాన్ని నిరుత్సాహపరిచే ప్రయత్నమని ఆరోపించారు. భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీపై ఆయన ప్రశ్నలు కురిపించారు. తుక్డే తుక్డే గ్యాంగ్ పక్కన నడుస్తుండగా ఇది ఎలాంటి భారత్ జోడో యాత్ర అవుతుందని అని అన్నారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి నడిచిన సినీ నటి ఊర్మిళ మటోండ్కర్
‘‘కాంగ్ (కాంగ్రెస్) డీఎన్ఏ పాక్కు అనుకూలంగా ఉంది. ఇది ఆర్మీని నిరుత్సాహపరిచే ప్రయత్నం. వారు పాక్తో నిలబడి ఉన్నారని చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ జీ ఇది ఎలాంటి భారత్ జోడో యాత్ర ? తుక్డే-తుక్డే గ్యాంగ్ మీతో నడుస్తోంది.’’ అని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ విశ్వసనీయతను ప్రశ్నించిన నేపథ్యంలో చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ వారు (కేంద్రం) సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడతారు. వారు చాలా మందిని చంపారని చెబుతారు. కానీ ఎలాంటి రుజువు లేదు’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. రక్షణ దళాల పట్ల తనకు గౌరవం ఉందని తెలిపారు.
అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు. ఆయన అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరిని ప్రతిబింబించవని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ.. ‘‘సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. కాంగ్రెస్ స్థితిని ప్రతిబింబించవు. యూపీఏ ప్రభుత్వం 2014 కి ముందు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అన్ని సైనిక చర్యలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో మద్దతు కొనసాగిస్తుంది.’’ అని అన్నారు.
2016 సెప్టెంబరులో పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్కు చెందిన నలుగురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలోని ఉరీ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి భారత ఆర్మీ బ్రిగేడ్ హెడ్క్వార్టర్పై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది సైనికులను చనిపోయారు. దీనికి ప్రతీకారంగా జమ్మూ కాశ్మీర్లో మోహరించిన వివిధ పారా (స్పెషల్ ఫోర్సెస్) యూనిట్లకు చెందిన కమాండోలతో పాటు ఇండియన్ ఆర్మీ దళాలు సరిహద్దు మీదుగా మల్టీ టార్గెట్ లపై దాడులు నిర్వహించాయి. అప్పటి నుండి ప్రభుత్వం సెప్టెంబర్ 29ని ‘‘సర్జికల్ స్ట్రైక్ డే’’గా పాటిస్తోంది.