విచారణకు రాలేను.. రెండ్రోజులు వాయిదా వేయండి, ఈడీకి సోనియా గాంధీ లేఖ
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా తాను రెండు రోజులు పాటు విచారణకు హాజరవ్వలేనని ఆమె బుధవారం ఈడీకి లేఖ రాశారు.
ఈడీకి (enforcement directorate) కాంగ్రెస్ (congress) అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా రెండ్రోజులు విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు రోజులు విచారణ వాయిదా వేయాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.
ఇకపోతే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఇంటి వద్దే రెస్ట్ తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించినట్టు ట్వీట్ చేశారు.
ALso REad:హాస్పిటల్ నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్.. త్వరలో ఈడీ ముందుకు!
సోనియా గాంధీ జూన్ 1వ తేదీన కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆమె ఐసొలేషన్లోకి వెళ్లారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కరోనా సమస్యలతో సోనియా జూన్ 12న ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్లో చేరారు. ఆమె ఆరోగ్యం సుస్థిరంగా ఉన్నదని ఇటీవలే ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో (national herald case) సోనియాను, రాహుల్ గాంధీని తమ ముందు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 8వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందు హాజరు కావాలని సమన్లు వచ్చాయి. కానీ, ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో విచారణకు హాజరవ్వడానికి మరింత సమయం కావాలని ఆమె ఈడీని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు ఈడీ ఈ తేదీలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.