ఉద్రిక్తంగా మారిన రెజ్లర్ల ఆందోళన.. బలవంతంగా వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, పూనియాల అరెస్టు.. వీడియో వైరల్
పార్లమెంట్ కొత్త భవనం సమీపంలో తలపెట్టిన ‘మహాపంచాయత్' కు వెళ్లేందుకు రెజర్లు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రముఖ రెజర్లందరినీ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేపట్టిన నిరనస ఉద్రిక్తంగా మారింది. కొత్త పార్లమెంటు భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగట్, ఆమె బంధువు, సోదరి సంగీతా ఫోగట్ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో రెజ్లర్లు, పోలీసుకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఒకరునొకరు తోసుకున్నారు. ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు.
పార్లమెంటును శవపేటికతో పోల్చడం తప్పు - అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్జేడీ తీరుపై ఫైర్
ఇదిలావుండగా.. సాక్షి మాలిక్ ను పోలీసులు బలవంతంగా నిర్బంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. భజరంగ్ పూనియా సహా ఇతర రెజ్లర్లు పోలీసు అధికారుల నుంచి ఆమెను విడిపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ నిరసనల మధ్య ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను సాక్షి కూడా ట్విటర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. ‘‘సాక్షి మాలిక్ ను పోలీసులు బలవంతంగా కస్టడీలోకి తీసుకున్నారు’’ అని హిందీ లో క్యాప్షన్ పెట్టారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా రెజర్లు ఏప్రిల్ 23వ తేదీ నుంచి ప్రారంభించిన నిరసన స్థలాన్ని కూడా అధికారులు క్లియర్ చేశారు. ఆదివారం ఉదయం నుంచే లుటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో వేలాది మంది పోలీసులను మోహరించారు. అనేక లేయర్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటు భవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో కూర్చొని నిరసన తెలుపుతున్న రెజ్లర్లు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో తమ 'మహాపంచాయత్'ను కొనసాగిస్తామని చెప్పారు.
అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు అనుమతి ఇవ్వనందున నిరసనకారులను కొత్త భవనం వైపు వెళ్లనివ్వబోమని, రెజ్లర్లు ఎలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని పోలీసులు తెలిపారు. పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి, ఆసియా గేమ్స్ స్వర్ణ విజేత వినేశ్ వంటి రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.