Kumbhmela 2025 : ప్రయాగ్‌రాజ్‌లో సీఎం యోగీ ఆదిత్యనాథ్ బౌద్ధ మహాకుంభ యాత్రను ప్రారంభించారు. 

Kumbhmela 2025 : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో బౌద్ధ మహాకుంభ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని ఆరాధనా విధానాలు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమని ఆయన అన్నారు. హిందూ, బౌద్ధ ధర్మాలు ఒకే వృక్షానికి చెందిన రెండు శాఖలు... ఇవి ఒకే వేదికపైకి వస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వృక్షంగా మారుతుందన్నార. ఇది నీడనివ్వడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుందన్నారు. 

ఈ బౌద్ద కుంభమేళా ా కార్యక్రమాన్ని సీఎం యోగి దీపం వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బౌద్ధ సన్యాసులు, పండితులపై యోగి పుష్పవర్షం కురిపించారు. ఇలా వారిని సాదరంగా గౌరవించారు.

భారత వ్యతిరేక శక్తులకు నిద్రాభంగం

భగవాన్ బుద్ధుడు ప్రపంచానికి కరుణ, మైత్రి సందేశాన్ని అందించారని సీఎం యోగి అన్నారు. కొందరు నేడు భారత్‌ను విభజించేందుకు కుట్రలు పన్నుతున్నారు... వివిధ మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కానీ సత్యమేవ జయతే అన్నట్లు ఎప్పటికయినా సత్యమే గెలుస్తుందన్నారు.

ఈ మహాకుంభ్ ఐక్యతా సందేశాన్ని ఇస్తుండగా, చాలా మందికి ఈ కార్యక్రమం నచ్చడం లేదని సీఎం అన్నారు. కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేశారు... తద్వారా దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఇది భారత వ్యతిరేక శక్తులకు నిద్రాభంగం కలిగించిందన్నారు.
మహాకుంభ్ ఐక్యతా సందేశాన్ని అందించడానికి గొప్ప మాధ్యమం. ఇది ఆత్మసాక్షాత్కారానికి కూడా మార్గం. ఈ మహాకుంభ్ సందేశం ప్రపంచానికి చేరాలి. మీరు ఇక్కడికి వచ్చి, మహాకుంభ్‌ను చూసి, త్రివేణి సంగమంలో స్నానం చేసి, ఐక్యతా సందేశాన్ని ఊరూరా, ఇంటింటికీ చేరవేస్తారని తెలిసి సంతోషంగా ఉంది.