చైనా తన వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి ప్రాంతాలను తమ భూభాగంగా చైనా పేర్కొంది.
న్యూఢిల్లీ: ఎన్నిసార్లు చెప్పినా చైనా వక్రబుద్ది మారడం లేదు. అరుణాచల్ , అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగంగా చైనా పేర్కొంది. ఎడిషన్ ఆఫ్ ది స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా -2023 పేరుతో మ్యాప్ ను డ్రాగన్ సోమవారంనాడు విడుదల చేసింది.కొత్తగా విడుదల చేసిన మ్యాపులో అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ లో భాగంగా చైనా చూపింది. డిజిటల్, నేవిగేషన్ మ్యాపులను కూడ విడుదల చేస్తామని చైనా చెబుతుంది.
అక్సాయిచిన్, అరుణాచల్ ప్రదేశ్ ను తమ భూభాగంలో చైనా చూపిందని జాతీయ మీడియా ఇండియా టీవీ కథనం ప్రసారం చేసింది. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ సోమవారంనాడు ఈ మ్యాప్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది. భారత సరిహద్దు ప్రాంతాల విషయంలో చైనా తీరు మారలేదని ఈ విషయం మరోసారి రుజువు చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాతమని ఇండియాా పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తైవాన్, దక్షిణ చైనా సముద్రం కూడ ఈ మ్యాప్ లో చూపింది డ్రాగన్.
తైవాన్ తన భూభాగంగా చైనా ఈ మ్యాప్ లో చూపింది.ఈ ఏడాది ఏప్రిల్ లో చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలను తమ భూభాగానికి చెందినవిగా తెలిపింది.
గత వారంలో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడితో మోడీ మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు అంశాలపై చర్చించారని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
2020లో భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. గత ఏడాది జీ20 సమావేశం బాలిలో జరిగిన సమయంలో ఈ ఇద్దరు నేతలు కలిశారు. ఆ తర్వాత బ్రిక్స్ సమావేశంలో వీరిద్దరూ కలిశారు.
