ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. మధ్యప్రదేశ్లో విషాదం
మధ్యప్రదేశ్లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అరుదైన జన్యు సమస్యతో బాధపడుతున్న తమ పిల్లలను కాపాడుకోలేకపోతున్నామని దంపతులు తమ ఇద్దరు పిల్లలను చంపేసి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. విదిషా జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
భోపాల్: మధ్యప్రదేశ్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కండరాలను బలహీనం చేసే ఒక అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లలను చంపేసి ఆ దంపతులూ మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
బీజేపీ మాజీ కార్పొరేటర్, మండల ఉపాధ్యక్షుడు సంజీవ్ మిశ్రా (45), ఆయన భార్య నీలమ్ (42), వారి కొడుకులు అన్మోల్ (13), సార్థక్ (7)లుగా మృతులను గుర్తించారు.
ఆ దంపతులు తమ పిల్లలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలతో కలత చెంది ఉన్నారని ఏఎస్పీ సమీర్ యాదవ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే వార్తా సంస్థకు తెలిపారు.
మిశ్రా సాయంత్రం 6 గంటల వరకు ఇంటి వద్దే ఉన్నారు. ‘ఇలాంటి వ్యాధి నుంచి ఆ దేవుడు శత్రువుల పిల్లలను కూడా కాపాడాలి.. నా పిల్లలను నేను కాపాడుకోలేకపోతున్నాను. నాకు అసలు జీవించాలనే లేదు’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దారుణానికి పాల్పడటానికి ముందు ఈ పోస్టు చేశాడు.
ఈ పోస్టు చూడగానే ఆయన మిత్రులు కొందరు మిశ్రా ఇంటికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఇంటి తలుపు కొట్టారు. కానీ, అది లోపలి వైపు నుంచి తాళం వేసి ఉన్నది. తలుపు తట్టినా ఎవరూ స్పందించ లేదు. దీంతో వారు ఆ డోర్ ను బద్దలు చేసి లోపలికి వెళ్లారు. ఆ నలుగు రూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అక్కడ వారంతా నిమిషాల తేడా తో నలుగురూ మరణించారు.
కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. చిన్నారులకు పంటలో ఉపయోగించే సెల్ఫోస్ మందు బిళ్లలను తినిపించారని, ఆ దంపతులు కూడా వాటినే తిన్నారని పోస్టుమార్టంలో తేలిందని పోలీసులు వివరించారు.