రాజస్థాన్ లో బాల్యవివాహం.. ఏడాది వయసు బాలికకుపెళ్లి.. 20 యేళ్ల తరువాత రద్దు చేసిన కోర్టు..
రాజస్థాన్ లో కోర్టు ఓ సంచలన తీర్పు నిచ్చింది. యేడాది వయసులో ఓ బాలికకు జరిగిన వివాహాన్ని 20యేళ్ల తరువాత రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
రాజస్థాన్ : బాల్య వివాహాల మీద చట్టాలు చేసినా.. కొన్ని చోట్ల ఆ అనాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. అయితే ఓ యువతి మాత్రం ఈ పెళ్లి నుంచి 20యేళ్ల తరువాత విముక్తి పొందింది. తన పుట్టినరోజు బహుమతిగా తనకు ఈ స్వేచ్ఛ లభించిందని చెప్పి సంతోషం వ్యక్తం చేసింది.
ఏడాది వయసులోనే చిన్నారి రేఖకు పెళ్లి చేశారు. ఆమె కాపురానికి రాకుంటే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాలని ఆమె యుక్తవయసుకు వచ్చాక.. రేఖ అత్తామామలు కుల పంచాయితీ చేసి తీర్పు చెప్పారు. దీంతో రేఖ సారథి ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి భారతిని సంప్రదించి సహాయం కోరింది. ఆ తరువాత సారథి ట్రస్టు రేఖతో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేయించింది. తాను ఏఎన్ఎం కావాలనుకుంటున్నానని, ఏడాది వయసులో తనకు జరిగిన బాల్య వివాహాన్ని తాను అంగీకరించనని రేఖ కోర్టులో చెప్పింది.
దారుణం.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని గొడ్డలితో నరికిన కుమారుడు.. ఎక్కడంటే ?
దీంతో ఈ కేసును విచారించిన కుటుంబ న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు అందరూ కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20 యేళ్ల వివాహాన్ని న్యాయస్థానం రద్దు చేస్తూ ఆదేశం ఇవ్వడంతో రేఖ ఆనందం వ్యక్తం చేసింది. ఏఎన్ఎం కావాలనే తన కలను నిజం చేసుకోవడం మీద దృష్టి సారిస్తానని రేఖ తెలిపింది. ‘ఈ రోజు నా పుట్టిన రోజు, ఈ రోజు నాకు 21 యేళ్లు నిండాయి. నా బాల్య వివాహాన్ని కోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు నా కుటుంబానికి పుట్టినరోజు బహుమతిగా వచ్చింది’ అని రేఖ సారథి ట్రస్టుకు ధన్యవాదాలు తెలిపారు.