భర్త ఆఫీసుకు వెళ్లి... సహోద్యోగుల ముందు అసభ్యపదజాలంతో దూషించడం భార్య క్రూరత్వమే అంటూ.. ఛత్తీస్ ఘడ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఛత్తీస్ ఘడ్ : భర్త పని చేసే ఆఫీసుకు వెళ్లి, పదిమంది ముందు అతడిని అసభ్య పదజాలంతో తిడుతూ.. వేధించడం క్రూరత్వం అవుతుందని ఛత్తీస్గఢ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడాకుల కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెడితే…దంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010లో రాయిపూర్ కు చెందిన ఓ మహిళతో వివాహం అయ్యింది. అయితే కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. భర్త, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.
తన భార్య తరచూ తనను వేధిస్తోందని, కనీసం తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని పేర్కొంటూ.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసులో వాదోపవాదాలు, సాక్ష్యాలను పరిగణించిన తర్వాత 2019 డిసెంబర్లో రాయపూర్ ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఈ కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టులోతన భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని, ఉత్తర్వులపై జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆమె ఆరోపణలు భర్త తోసిపుచ్చాడు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫోన్ కాల్లో గుర్తుపట్టలేదు.. విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగి
తనకు వివాహేతర సంబంధం ఉందని భార్య చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువుకు భంగం కలిగిందని.. ఆ వ్యక్తి న్యాయస్థానానికి తెలిపాడు అక్కడితో ఆగకుండా తన భార్య ఆఫీసుకు వచ్చి, తనని అసభ్య పదజాలంతో దూషించిందని, తనను మరో చోటుకు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిందని వాపోయాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. రాయపూర్ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత భర్తకు వివాహేతర సంబంధముందని భార్య చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలింది. తప్పుడు ఆరోపణలతో ఆ భార్య.. భర్త పనిచేసే ఆఫీస్ కి వెళ్లి అక్కడ అతని సహోద్యోగుల ముందు అతడిని దూషిస్తూ మాట్లాడటం, అతడి పరువు తీసేలా ప్రవర్తించడం క్రూరత్వమే అవుతుంది, భర్త తన తల్లిదండ్రులను కలుసుకోకుండా వేధించడం, అక్రమ సంబంధం నిందలు వేసి అతడిని బదిలీ చేయాలని కోరడం కూడా తీవ్రమైన విషయమే. అందుకే ఆ భార్య నుంచి విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సమర్పిస్తున్నాం’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
