లిక్కర్ బ్యాన్ చేయాలని అనుకున్నా.. కానీ, అది చూసి భయపడ్డా: ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బాఘేల్
ఛత్తీస్గడ్లో లిక్కర్ బ్యాన్ చేయాలని సీఎం భూపేశ్ బాఘేల్ భావించారని చెప్పారు. కానీ, కరోనా లాక్డౌన్ సమయంలో మందు అందుబాటులో లేక చాలా మంది విషపూరిత ఆల్కహాల్ తీసుకున్నారని, కొందరైతే శానిటైజర్లు తాగి మరణించారని వివరించారు. అందుకే లిక్కర్ బ్యాన్ చేసే సాహసం చేయలేదని చెప్పారు.
రాయ్పూర్: ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాను లిక్కర్ బ్యాన్ చేయాలని అనుకున్నారని, కానీ, ఆ సాహసం చేయలేదని వివరించారు. దుర్గ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సీఎం ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. గత సీఎం రమణ్ సింగ్ అమల్లోకి తెచ్చిన వ్యవస్థలే ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు.
ఆయన లాక్డౌన్ రోజులను గుర్తు చేసుకుంటూ కరోనా మహమ్మారి రాకముందు తాను రాష్ట్రంలో లిక్కర్ బ్యాన్ చేయాలని భావించినట్టు సీఎం భూపేశ్ బాఘేల్ తెలిపారు. ‘నేను ఆల్కహాల్ బ్యాన్ చేయాలని అనుకున్నాను. కానీ, అప్పుడే కొవిడ్ 19 మహమ్మారి వచ్చింది. ఈ మహమ్మారిని అదుపులో పెట్టడానికి లాక్డౌన్ విధించారు. అప్పుడు కొందరు నకిలీ ఆల్కహాల్, విషపూరిత ఆల్కహాల్ను తీసుకోవడం మొదలు పెట్టారు. ఇంకొందరైతే లిక్కర్ దొరక్కా శానిటైజర్లు తాగి మరణించారు.’ అని అన్నారు.
కాబట్టి, ఆల్కహాల్ బ్యాన్ చేస్తే ఇలాంటి విపరిణామాలు చోటుచేసుకునే ముప్పు ఉన్నదని సీఎం భూపేశ్ బాఘేల్ తెలిపారు. ఫేక్, విషపూరిత లిక్కర్ తాగి ప్రజలు చనిపోతారనే భయంతో ఆల్కహాల్ బ్యాన్ చేయడానికి సాహసించలేదని చెప్పారు.
అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన టికెట్ల పంపిణీ గురించి మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు చాలా వరకు మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారని, అలాంటప్పుడు వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. కొందరు మాత్రమే ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలతో ఉన్నారని, వారి పరిస్థితులు కూడా మూడు నాలుగు నెలల్లో మెరుగుపడుతుందని వివరించారు. కాబట్టి, వారి టికెట్లు ఎందుకు కట్ చేయాలని ప్రశ్నించారు.