అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం బొమ్డిలా పశ్చిమ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. నేటి ఉదయం 09.15 గంటల నుంచి ఆ హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాకు పశ్చిమాన మండల సమీపంలో కుప్పకూలింది. హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు అందులో పైలట్, కో-పైలట్లు ఉన్నారు. వారిని రక్షించడానికి ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.ఈ రోజు ఉదయం సెంగే నుంచి మిస్సమరి వెళ్తుండగా చీతా హెలికాప్టర్ గల్లంతైంది. ఈ రోజు ఉదయం 09:15 గంటలకు హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది.
అదానీ సమస్యపై చర్చ జరగకూడదనే పార్లమెంటును నడపనివ్వడం లేదు - కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
‘‘అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్డిలా సమీపంలో ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ మార్చి 16న ఉదయం 09:15 గంటలకు ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందల సమీపంలో ఇది కూలిపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు ప్రారంభయ్యాయి. ’’ అని ఓ పత్రికా ప్రకటన వెలువడింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గతేడాది అక్టోబర్ లో కూడా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఇదే రకం చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. తవాంగ్లోని ఫార్వర్డ్ ఏరియాల వెంట రొటీన్ మిషన్లో హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
