కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం: దిగొచ్చిన చంద్రబాబు
సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
వీవీప్యాట్స్లిప్పులను 50 శాతం లెక్కించాలని కోరుతూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు తిరస్కరించింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.
తాము కోరేది న్యాయమైన డిమాండ్ అని చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ విషయమై తాము ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి ఇదే డిమాండ్ను ముందు పెడతామన్నారు.అంతేకాదు ఇదే విషయమై ప్రజలను చైతన్యవంతం చేస్తామని బాబు చెప్పారు.
తాము వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని చంద్రబాబునాయుడు కోరారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలు ఉంటే ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరనున్నట్టు ఆయన చెప్పారు.
సమయం చాలదని ఎన్నికల కమిషన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.