సెకండ్ వేవ్లో వ్యాపారాలు బేజారు... మరో ఉద్దీపన ప్యాకేజీ దిశగా కేంద్రం, త్వరలోనే ప్రకటన
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాల కారణంగా, వైరస్ను కట్టడి చేసేందుకు మళ్లీ లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాల కారణంగా, వైరస్ను కట్టడి చేసేందుకు మళ్లీ లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి నష్టాలను మూటకట్టుకుంటున్నాయి.
ఇది దేశ జీడీపీపైనా పెను ప్రభావం చూపించే అవకాశముందని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు పలు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ వేవ్లో తీవ్రంగా ప్రభావితమైన రంగాలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు బ్లూమ్బర్గ్ కథనం పేర్కొంది.
Also Read:గుడ్న్యూస్: ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు
ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పర్యాటకం, విమానయానం, ఆతిథ్య రంగాలకు ఉద్దీపనలు ప్రకటించేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(పీహెచ్డీసీసీఐ) కూడా ప్యాకేజీ విషయమై కేంద్రానికి అభ్యర్థనలు చేసింది.
ఈ సందర్భంగా వృద్ధికి ఊతమిచ్చేలా 17 సిఫార్సులు చేసింది. దేశంలోని ప్రతి ఇంటిపైనా కరోనా ప్రభావం చూపిస్తోందని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యాపారాలను ఆదుకునేందుకు ప్రాధాన్యమైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో కేంద్రాన్ని కోరింది. కాగా, కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశముందని పలు ఆర్ధిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.