ఉగ్రవాదంపై ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వెల్లడించింది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతిగా ఈ చర్య తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి 1:44కి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటనలో ఇది "నియంత్రితమైన, శాంతియుత, ప్రణాళికాబద్ధమైన" చర్యగా పేర్కొంది. ఇందులో పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకపోయినప్పటికీ, తొమ్మిది ఉగ్ర సంబంధిత కేంద్రాలపై దాడులు జరిపినట్టు తెలిపింది.
“న్యాయం జరిగింది. జై హింద్” అంటూ భారత సైన్యం X (ట్విటర్)లో పోస్ట్ చేసింది. అంతకుముందు "Ready to Strike, Trained to Win" అనే వీడియోను కూడా షేర్ చేసింది.
PoKలోని ముజఫర్అబాద్, పాకిస్థాన్ పంజాబ్లోని బహావల్పూర్ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు విన్నట్టు స్థానిక నివేదికలు వచ్చాయి. దీనికి కొద్దిసేపటిలోనే భారత ప్రభుత్వం అధికారికంగా ఆపరేషన్ వివరాలను ప్రకటించింది.
ఇక ఆపరేషన్ సింధూర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఆపరేషన్ సింధూర్ – ఖచ్చితమైనది, కఠినమైన దెబ్బ అంటూ అభివర్ణించారు. మన సైన్యం ప్రత్యర్థికి నొప్పి కలిగే చోటే దాడి చేసింది. పహల్గాం అమరవీరులకు న్యాయం జరిగింది. భారత్తో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. మన సైనికులను చూస్తే గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు.
కేంద్ర మంత్రి కిరణ్ జిజురీ స్పందించారు. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు. PIB ప్రకటనలో, “ఈ దాడులు పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైనవారిని శిక్షించేందుకు తీసుకున్న చర్యలు. ఇది ప్రభుత్వ విధేయతకు నిదర్శనం,” అని పేర్కొంది.