జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు కాపాడటంలో కేంద్రం విఫలం - ఫరూక్ అబ్దుల్లా
కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఫరుక్ అబ్దుల్లా విమర్శలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని చెప్పారు. కాశ్మీర్ అంశంలో బీజేపీ వైఖరి మార్చుకోవాలని తమ పార్టీ సూచించిందని, కానీ తమ మాట వినలేదని అన్నారు.
జమ్మూకాశ్మీర్ లో శాంతి స్థాపన చేసేందుకు ప్రభుత్వం చేసిన బలవంతపు ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. హజ్రత్ బల్ నియోజకవర్గంలో ఒక రోజు పాటు బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు ప్రభావాలను ప్రతీ ఫ్రంట్ లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న హింసల ద్వారా చూడవచ్చని విమర్శించారు.
‘‘ 2019 ఆగస్టు 5వ తేదీన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాల వల్ల తలెత్తిన భయానక పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. జమ్మూకశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి ’’ అంటూ అబ్దుల్లా పేర్కొన్నారు. అలాగే కశ్మీర్, జమ్మూ, చీనాబ్, పీర్ పంజల్లలో శాంతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయడంలో విఫలమైందని ఆయన చెప్పారు.
సిద్ధూ మూసేవాలా హత్యలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యే సూత్రధారి - ఢిల్లీ పోలీసులు
కాశ్మీర్ విషయంలో వైఖరిని మార్చడంలో బీజేపీని ఒప్పించడానికి తమ పార్టీ ప్రయత్నించిందని, కానీ వారు వినలేదని ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. ఇప్పుడు వారు తమ వైఫల్యాలతో పోరాడుతున్నారు. ఇక్కడ శాంతి లేదా అభివృద్ధి కనిపించడం లేదు అని ఫరుక్ అబ్దుల్లా చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. భారతదేశంతో జమ్మూ కాశ్మీర్ సంబంధాన్ని కాపాడటానికి నేషనల్ కాన్ఫరెన్స్ పోరాడుతోందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను తిరిగి పొందడానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ శక్తులను తమ పార్టీ చేరుకుంటుందని అబ్దుల్లా నొక్కి చెప్పారు.
కాగా హిందువులను టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో లోయలో అశాంతి వాతావరణం నెలకొనడం, హత్యలు జరగడం వంటి ఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోయలోని మైనారిటీ హిందూ సమాజంపై మే 1 నుండి కనీసం తొమ్మిది దాడులు జరిగాయి. ఇటీవల జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని ఉగ్రవాదులు హతమార్చారు. ఈ సంఘటనలు సమాజంలో అశాంతిని సృష్టించాయి. భద్రతా కారణాలతో లోయను విడిచిపెట్టాలని చాలా భావిస్తున్నట్టు చాలా మంది హిందువుల తెలిపారు.
కొడుకు మృతదేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిచ్చమెత్తుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్
గత నెల 25వ తేదీన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరి కొన్ని రోజులు అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీరీల కోసం వెతకాల్సి వస్తుందని చెప్పారు. ‘‘ మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. కానీ ఈ రోజు నా పిల్లలు కాశ్మీరీ పండిట్లు అంటే ఎవరు ? వారు ఎలా కనిపిస్తారు ? అని నన్నుఅడుగుతున్నారు. ఎందుకంటే వారు అదృశ్యమవుతున్నారు. వారి సంఖ్య తగ్గింది. అలాగే మేము కూడా దృఢంగా నిలబడలేకపోతే.. మా ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది ’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి.. నేడు రైతుల నుండి భూములను లాక్కుంటున్నారని, ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాళ్లు రువ్వకపోయినా, షట్ డౌన్ పాటించకపోయినా ఇక్కడ 10 లక్షల మంది సైనికులు ఉన్నారని ఆమె చెప్పారు.