యాస్పై సమీక్ష: మమత కోసం మోడీ నిరీక్షణ, అరగంట లేట్.. మళ్లీ క్షణాల్లో వెళ్లిపోయిన దీదీ
యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చి వెంటనే వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు అరగంట పాటు సీఎం మమత కోసం ప్రధాని మోడీ ఎదురుచూశారు.
యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చి వెంటనే వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు అరగంట పాటు సీఎం మమత కోసం ప్రధాని మోడీ ఎదురుచూశారు. ఆ తర్వాత ఆమె వచ్చినప్పటికీ.. కాసేపటికే దీదీ వెళ్లిపోయారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివరణ కూడా ఇచ్చారు.
యాస్ తుఫాన్ సమీక్షా సమావేశం మోడీతో వున్న విషయం తనకు తెలియదని.. అదే సమయంలో మరో చోట అధికారులతో కీలక సమావేశం ముందే ఫిక్సయ్యిందన్నారు. దీంతో ప్రధాని మోడీకి తుపాను నష్టంపై ముందే నివేదిక సమర్పించానన్నారు. 20 వేల కోట్ల సాయం కావాలని అడిగినట్లు మమత చెప్పారు. అధికారులతో కీలక సమావేశం వుందని.. ప్రధానికి చెప్పానని, మోడీ అనుమతి తీసుకునే ఆ సమీక్ష నుంచి నిష్క్రమించినట్లు సీఎం తెలిపారు.
Also Read:యాస్పై మోడీ సమీక్ష.. సువేందుకు ఆహ్వానం: నేను రానంటూ తేల్చిచెప్పిన దీదీ
అయితే మమత తనకు సమావేశం సరిగా లేదని చెబుతుంటే.. అటు కేంద్రం వర్సెస్ గవర్నర్ తీరు మరోలా వుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఇతర అధికారులు హాజరుకావాలి. కానీ అలా జరగలేదు, ఈ సమావేశం ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని.. కానీ సీఎం, అధికారులు హాజరుకాకపోవడం రాజ్యాంగాన్ని అనుసరించకపోవడమేనని గవర్నర్ ట్వీట్ చేశారు.
ఈ సమీక్షా సమావేశానికి ప్రతిపక్షనేత సువేందు అధికారిని పిలవడంతోనే మమతా బెనర్జీ ఈ విధంగా వ్యవహరించారని వాదన వుంది. ప్రధాని సమావేశానికి సీఎం హాజరుకాకపోవడం చీకటి రోజు అని సువేందు మండిపడ్డారు. ఎన్డీయేతర సీఎంలు ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నారని .. కానీ మమతకు మాత్రం రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమంటూ సువేందు దుయ్యబట్టారు.