CDS Bipin Rawat: రేపు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎయిర్ఫోర్స్ చీఫ్
తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో జరగనున్నాయి.
తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (group captain varun singh) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం వెల్లింగ్టన్లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రావత్ దంపతులతో పాటు సీనియర్ అధికారుల మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాత్ సింగ్.. ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నేడు సాయంత్రం ఢిల్లీకి రావత్ దంపతుల భౌతికకాయాలు..
కున్నూరు సమీపంలో హెలికాఫ్టర్ కూలిన స్థలాన్ని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. జనరల్ రావత్ సహా ఇతర మృతులకు వెల్లింగ్టన్లోని మద్రాసు రెజిమెంటల్ కేంద్రం (ఎంఆర్సీ)లో గురువారం పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తారు. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి తదితరులు అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు.
Also read: Army Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్కడు ఈయనే...
అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను కోయంబత్తూరుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి వాయుమార్గంలో ఢిల్లీకి తరలిస్తారు. గురువారం సాయంత్రం వారి భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకుంటాయి. అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను.. ఢిల్లీలోని వారి నివాసానికి తరలిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రజలు నివాళులర్పించడానికి అనమతిస్తారు. ఆ తర్వాత కామరాజ్ మార్గ్ నుంచి ఢిల్లీ కంటోన్మెంట్లో స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమాయాత్ర సాగనుంది. అక్కడ శుక్రవారం సాయంత్రం రావత్ దంపతుల అంత్యక్రియలను (Bipin Rawat Funerals) నిర్వహించనున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి, తమిళనాడు డీజీపీ సి శైలేంద్రబాబులు గురువారం ఉదయం కున్ననూర్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయంపై వీఆర్ చౌదరి ఆరా తీశారు. అక్కడి ప్రత్యక్ష సాక్షులు, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అధికారులతో మాట్లాడారు.
అసలేం జరిగింది..
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్ బిపిన్ రావత్ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు.బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో వెల్లింగ్టన్కు బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది.