ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు.. రేపు అరెస్టు చేస్తారని ఆప్ జోస్యం
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు లిక్కర్ ఎక్సై పాలసీ కేసు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. అనంతరం, ఆప్ నేతలు మాట్లాడుతూ రేపు మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తుందని జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు పంపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో విచారణకు హాజరవ్వాలని, రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయానికి రావాలని సమన్లు పంపింది. ఈ సమన్లు రాగానే గంటల వ్యవధిలోనే ఆప్ ఒక విలేకరుల సమావేశం నిర్వహించింది. సీబీఐ రేపు మనీశ్ సిసోడియాను అరెస్టు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. ఈ సమన్లు త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చాయని ఆరోపించారు. అక్కడ బీజేపీ, ఆప్ నేరుగా తలపడుతున్నాయని అన్నారు. బీజేపీ భయపడే ఈ సమన్ల దారి ఎంచుకున్నదని ఆరోపణలు చేశారు.
సీబీఐ గతంలో చేసిన తనిఖీల్లో ఏమీ దొరకలేదని ఈ సమన్ల తర్వాత మనీశ్ సిసోడియా స్పందించారు. అయినా, తాను సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వివరించారు. సీబీఐ తన నివాసంలో 14 గంటలపాటు తనిఖీలు చేసిందని ఆయన పేర్కొన్నారు. అందులో సీబీఐకి లభించినదేమీ లేదని వివరించారు. వారు తన బ్యాంక్ లాకర్ను తనిఖీ చేశారని, అందులోనూ ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. వారు తమ గ్రామానికి వెళ్లినా ఉత్తి చేతులతోనే వినుదిరగాల్సి వచ్చిందని వివరించారు.
ఇప్పుడు వారు సీబీఐ హెడ్ క్వార్టర్కు రేపు ఉదయం 11 గంటలకు రమ్మంటున్నారని, తాను తప్పకుండా వెళ్లుతానని మనీశ్ సిసోడియా తెలిపారు. విచారణకు తమను పూర్తిగా కొఆపరేట్ చేస్తానని వివరించారు.
కాగా, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన డిప్యటీ సీఎం మనీశ్ సిసోడియాకుు మద్దతుగా నిలబడ్డారు. జైలు ఊచలు, ఉరి తాడు కూడా భరత్ సింగ్ బలమైన ఆలోచనలను ఏమీ చేయలేకపోయాయని వివరించారు. మరో ట్వీట్లో ఇది రెండో స్వాతంత్ర పోరాటం అని, ఇందులో మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లు నేటి భగత్ సింగ్లు అని పేర్కొన్నారు.